నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ జీడీపీ 2015లో 2.1 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో 4.3 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105 శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్ చెప్పింది. అయితే ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బీజేపీ ఐ.టి సెల్ అధినేత అమిత్ మాలవీయ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ, ప్రాంతీయ పత్రికలు కూడా ఈ వార్తకు పెద్ద ఎత్తున ప్రాచుర్యమిచ్చాయి. భజనపరుల సంగతి చెప్పేదేముంది, కీర్తి గీతాలు పాడుతున్నారు. బుర్రకు పని చెప్పకుండా చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు ఎన్నైనా చెబుతారు. బీజేపీ పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చినపుడు బీజేపీ 709 బిలియన్ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105 కంటే ఎక్కువని చెబుతారు. ఎవరన్నా గట్టిగా కాదు అంటే మున్సిపల్ అధికారులు వచ్చి నిబంధనలన్నీ సక్రమంగానే పాటించినా వారి ఇళ్ల గోడల నిర్మాణంలో ఇసుక, సిమెంటు పాళ్లలో తేడా కనిపిస్తోందని, హానికారక రంగులు వేశారంటూ వెంటనే బుల్డోజర్లతో కూల్చివేసే రోజులివి. వ్యంగ్యాన్ని భరించలేక ముంబైలో కునాల్ కమ్రా ప్రదర్శన జరిగిన హాలును ఎలా కూల్చివేశారో చూశాంగా!
టీవీ9 నిర్వహించిన సమావేశంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చూద్దాం. ”నేడు ప్రపంచ కళ్లన్నీ భారత్ మీదే”. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచీ పదాలు మార్పు ఉండవచ్చు తప్ప ఇదే పాట. ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యలో అయినా లేదా వివాద పరిష్కారంలోనైనా భారత పాత్రను కోరిన దేశాలు గానీ, మోడీ ప్రమేయంగానీ ఉన్న ఉదంతం ఒక్కటంటే ఒక్కటి ఉందా? కానీ మోడీ చెప్పిందాన్ని మరోవైపు నుంచి చూస్తే నూటికి నూరు పాళ్లూ వాస్తవం. ఏమిటంటే మన మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోవటానికి, తమకు అవసరం లేని వాటిని మనకు అంటగట్టటానికి (ప్రపంచంలో నిషేధించిన అనేక పురుగుమందులు, రసాయనాలు, ఔషధాలు మన దగ్గర పుష్కలంగా దొరుకుతున్నాయి), ఇక్కడి కార్పొరేట్లకు మోడీ సర్కార్ ఇస్తున్న రాయితీల కారణంగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు తరలించుకుపోవటానికి మనవైపు చూస్తున్న మాట వాస్తవం.
”గత పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం.వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు”. ప్రధాని చెప్తున్న ఈ మాటలకు వాస్తవ పరి స్థితికి లంకె కుదరటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పథకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని అదే నోటితో చెప్పటం విన్నాం. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలిలేని (9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం (20 నుంచి 34.9), ఆందోళనకరం (35 నుంచి 49.9), అత్యంత ఆందోళనకరం (50 పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు గత పదేళ్లుగా కూడా ఉంది. అనూహ్య అద్భుతాలు లేదా నరేంద్ర మోడీకి కొత్తగా దైవిక శక్తులు వస్తే తప్ప దాన్నుంచి సమీప భవిష్యత్లో బయటపడే స్థితి దరిదాపుల్లో కూడా లేదు. పదేళ్లలో జీడీపీ రెట్టింపు అని గొప్పలు చెప్పుకుంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ శభాష్ అని చెప్పుకుంటున్నారు పాలకులు, ఆ పదేండ్లలో 2014 నుంచి 2024 వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది. దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు? అయినా సరే దీనికే పొంగిపోతున్నాం. ఇదే కాలంలో పాకిస్తాన్ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, మనకంటే మెరుగైన అభివృద్ధి అంటే పాకిస్తాన్ ఏజంట్లని ఎదురు దాడి చేస్తారు. పాక్ ర్యాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు? గత పదేళ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్ర మోడీ అతిశయోక్తుల గురించి చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలు.
ఆర్థిక విస్తరణలో జి7, జి20, బ్రిక్స్ దేశాలన్నింటి కంటే అసాధారణ వృద్ధి సాధించినట్లు వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వర్ణించారు. త్వరలో జీడీపీలో భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని బీజేపీ పెద్దలు, వారి సమర్ధకులు నిత్యం ఊదరగొడుతుంటారు. ఇదొక మైండ్ గేమ్. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా? ప్రస్తుతం జపాన్ను అధిగమించేందుకు మోడీ చూస్తున్నారని, 2027 తొలి ఆరు నెలల్లోనే 4.9 లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు. అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేళ్లలో భారత్ 105 శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్ 28 శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల మైలు రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు దాటింది. 2032 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల జీడీపీ కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోస్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగేండ్లలోనే 4.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 1.5 సంవత్సరాలకు (18 నెలలకు) ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.
కొంత మందికి అంకెలతో ఆడుకోవటం వెన్నతో పెట్టిన విద్య. అంతా అద్భుతంగా ఉందని చెబుతూనే 2025 ఆర్థిక సంవత్సరంలో వఅద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని సన్నాయి నొక్కులు. రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు కొందరు. చెన్నరు కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని ప్రశ్నించారు. జీడీపీలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు. తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139 దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు. పర్చేజింగ్ పవర్ పారిటీ (పిపిపి) పద్ధతి జీవన ప్రమాణాలను మెరుగ్గా వెల్లడిస్తుందని కొందరు చెబుతారు. దాని ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేళ్లలో మన జీడీపీ105 శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జీడీపీలో 141వ స్థానం అని కూడా చెప్పింది. మనకంటే పేద దేశమైన కంపూచియా పైన ఉంది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్ 143, పాకిస్తాన్ 159, సీ జిన్పింగ్ ఏలుబడిలో కుప్పకూలి పోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో ఉందని కూడా ఐఎంఎఫ్ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం మూడు దశాబ్దాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్ చెప్పారు. చైనా తలసరి జీడీపీ 2025లో 13,873 డాలర్లు. ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రథమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581 (2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్ దేవుడున్న అమెరికా 89,678 (2025 ఐఎంఎఫ్) స్థాయికి, చివరికి పడక కుర్చీ మేథావులు త్వరలో అధిగమించే దూరం ఎంతో దూరం లేదని నమ్మించేందుకు చూస్తున్న చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో ఆల్జీబ్రా లేదా వేద గణితం ఏదో ఒక అడ్డగోలు పద్ధతిలో లెక్క వేసుకోవాల్సిందే.
– సత్య