కార్పొరేట్ తరహా ‘దోపిడీ మాఫియా’ గుట్టు రట్టు
బీహార్ జైలు నుంచే స్కెచ్.. ‘గోల్డెన్ థీఫ్’ మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
నెలనెలా జీతాలు.. ఇన్సెంటీవ్లు..
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్ క్రైమ్
అది ఒక సాధారణ దోపిడీ కాదు.. పక్కా కార్పొరేట్ నెట్వర్క్. అక్కడ దొంగలకు నెలనెలా జీతాలు ఉంటాయి. దోచుకున్న సొమ్ములో ఇన్సెంటివ్లు ఉంటాయి. పక్కా ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, నకిలీ గుర్తింపు కార్డులతో ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా జ్యువెలరీ షాపులు, బ్యాంకులను టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగానే సినిమా స్క్రీన్ ప్లేను తలపించేలా దోపిడీ చేసిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అంతర్రాష్ట్ర ముఠాను ఛేదించి, ప్రధాన సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో గురువారం మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం వెల్లడించారు.
జైలు నుంచే ‘గోల్డెన్ థీఫ్’ ఆపరేషన్
ఈ దోపిడీ వెనుక ఉన్నది సామాన్యుడు కాదు. బీహార్ జైలులో ఉంటూనే దేశవ్యాప్తంగా నెట్వర్క్ నడుపుతున్న సుభోద్ సింగ్, అలియాస్ ‘ది గోల్డెన్ థీఫ్’. ఇతని ముఠాలో సభ్యులకు కంపెనీల్లో లాగే నెలకు నిర్ణీత జీతాలు చెల్లిస్తారు. అంతేకాకుండా, దోపిడీ చేసిన సొమ్ములో 10 నుంచి 15 శాతం వరకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఈ ముఠా లోని సభ్యుల్లో దోపిడీలో పాల్గొనే సమయం వరకూ ఎవరెవరనేది వారికీ తెలి యదు. వారికి నకిలీ పేర్లు అంట గట్టి.. ఆపేర్లతోనే చలామణి అయ్యేలా చూ స్తారు. ఒక నిందితుడు పట్టు బడ్డా.. మిగిలిన వారెవరనేది తెలి యకుండా జాగ్రత్త పడతారు. ఈ మాఫియా ఒక క్రైమ్ సిండికేట్లాగా పని చేస్తుంది. ఆధునిక సాంకేతికతను వాడుకోవ డంలో వీరు ఆరి తేరిన వారు. సుభోద్ సింగ్ ఆదేశాల మేరకు రఘునాథ్ కర్మాకర్ (జగీరా సింగ్), రవీష్ కుమార్, రాధే, మిశ్రా, సనోజ్ ఐదుగురు నిందితులు రెండు నెలల కిందటే తెలంగాణకు చేరుకున్నారు. దొరక్కుండా ఉండేం దుకు జార్ఖండ్-బెంగాల్ సరి హద్దుల్లో మెహతాబ్ఖాన్ అనే వ్యక్తి వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ.10వేల చొప్పున కొను గోలు చేశారు. ముందుగా ఖమ్మం, సిద్దిపేట, పెద్ద పల్లి, కరీంనగర్ ప్రాంతా ల్లోని భారీ షోరూమ్ లపై కన్నేసి, చివరకు కరీంనగర్ పీఎంజే షాపు ను ఎంచుకున్నారు. దోపిడీకి రెండు రోజుల ముందు (మే 1న) వీరు ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్కు మకాం మార్చారు. మే 2న జగీరాసింగ్ మంచిర్యాల మీదుగా రైలులో మహారాష్ట్రలోని చంద్రపూర్ వెళ్లి.. గడ్ చందూర్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 6 పిస్టల్స్, మ్యాగ జైన్లు తీసుకుని తిరిగి వచ్చాడు.
ఆ రోజు ఏం జరిగింది?
మే 3వ తేదీన ధర్మపురి నుంచి రెండు బైక్లపై బయలు దేరిన నిందితులు, వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద నకిలీ నంబర్ ప్లేట్లు మార్చారు. ఆ తర్వాత పక్కా వ్యూహంతో షాపులోకి ప్రవేశించారు. ముందుగా రాధే అనే నిందితుడు కస్టమర్లా లోపలికి వెళ్లి పరిస్థితిని గమనించాడు. అతని నుంచి సిగల్ అందగానే మిగిలిన వారు పిస్టల్స్తో లోపలికి చొరబడి సిబ్బందిని బెదిరించారు. స్టాఫ్ అడ్డుకోవడానికి ప్రయత్నించ గా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలను బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు.
సినిమా ఫక్కీలో ఎస్కేప్ ప్లాన్!
దోపిడీ అనంతరం పోలీసులను ముప్పు తిప్పలు పెట్టేలా దుండగుల ఎస్కేప్ ప్లాన్ సాగింది. ఒక బ్యాగ్ను దొంగతనం సమయంలో ఆందోళనలో షాపులోనే వదిలేసినా.. మిగిలిన బ్యాగ్తో పల్సర్, అపాచీ బైక్లపై ధర్మపురికి చేరారు. ముగ్గురు నిందితులు రవీష్ కుమార్, రాధే, సునోజ్ పల్సర్ బైక్ను ధర్మపురి గోదావరి ఒడ్డున వదిలేసి, నదిని దాటి మంచిర్యాల నుంచి రైలులో బీహార్కు పరారయ్యారు. జగీరా సింగ్, మిశ్రా అపాచీ బైక్పై గుండాల అడవుల్లోకి వెళ్లి, అక్కడ ముందుగా సిద్ధంగా ఉన్న ఒక తెల్లటి క్రెటా కారుకు నగలు, బైక్ అప్పగించి వారు కూడా రైలులో పరారయ్యారు.
పోలీసుల వేటలో దొరికిన కీలక నిందితులు
సీపీ గౌస్ ఆలం నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ డంప్, ఇతర సాంకేతిక నిఘా ఆధారంగా మొత్తం ముఠా గుట్టును విప్పారు. ఈ ముఠా లీడర్ సుభోద్ సింగ్ (మాస్టర్ మైండ్) ప్రస్తుతం జైలులో ఉన్నా దేశవ్యాప్తంగా భారీ దోపిడీలకు స్కెచ్ వేసినట్టు తేల్చారు. ఈ దోపిడీలో లాజిస్టిక్స్, ఫైనాన్స్, రెక్కీ, డ్రైవింగ్.. ఇలా వేర్వేరు పాత్రలు పోషించిన మొత్తం 13 మంది నిందితులను గుర్తించారు. వీరిలో ప్రధాన నిందితుడు జగీరా సింగ్ను మే 13న సాయంత్రం 4 గంటలకు వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని (రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్) బీహార్, బెంగాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై నగరానికి తీసుకొచ్చారు. వీరి నుంచి రూ.51వేలు, నకిలీ ఆధార్ కార్డులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న రాధే, మిశ్రా, సనోజ్తోపాటు.. లాజిస్టిక్ ఏర్పాట్లు చేసిన వ్యక్తి, ఆపరేషన్ కో-ఆర్డినేటర్, క్రెటా కారు డ్రైవర్, డబ్బు సమకూర్చిన ఫైనాన్షియర్ సహా మొత్తం 10 మంది కోసం పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. పట్టుబడిన నిందితుల్లో రఘునాథ్ కర్మాకర్ (జగీరా సింగ్)పై వివిధ రాష్ట్రాల్లో 7 హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. మరో నిందితుడు రావిష్ కుమార్పై 15 క్రిమినల్ కేసులు (దోపిడీ, హత్య) నమోదయ్యాయి.



