నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణం చేసేవారు త్వరగా ఇంట్లో నుంచి బయలుదేరాలని సూచించారు. అదేవిధంగా ప్లాట్ ఫామ్ నంబర్.1 నుంచి వెళ్లే వారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ ఫామ్ నంబర్.10ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.