– జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశంలో నిరుద్యోగం
– బీజేపీపై రాహుల్ ఆగ్రహం
రాంచీ : గిరిజనుల హక్కుల కోసం నిలబడతామని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా జార్ఖండ్లో ఆయన పర్యటించారు. ధనబాద్ జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ‘జల్-జంగిల్-జమిన్’పై గిరిజనుల హక్కుల కోసం తమ పార్టీ నిలబడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. శనివారం రాత్రి తుండి ప్రాంతంలో ఆగిన ఆయన యాత్ర.. తిరిగి ధనబాద్లోని గోవింద్పూర్ నుంచి ప్రారంభమైంది. ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వ రంగాన్ని కట్టబెట్టకుండా రక్షించటం, దేశంలోని నిరుద్యోగ యువత, గిరిజనులకు న్యాయం కల్పించటమే ఈ యాత్ర ముఖ్యోద్ధేశం అని రాహుల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు, జీఎస్టీతో దేశంలో నిరుద్యోగాన్ని పెంచిందని రామ్గఢ్లో ఆయన ఆరోపించారు. కాగా, జార్ఖండ్లో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించటం గమనార్హం.