– జూన్12 నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు
– ఫీజుల మోతతో తల్లిదండ్రుల పారేషాన్
– తరగతి ఏదైనా ఫీజులు వేలల్లోనే
– నియంత్రణ చేయకపోతే సామాన్యులకు తప్పని ఇబ్బందులు
జూన్ వస్తోందంటే చాలు జిల్లా ప్రజలు వణికిపోతారు.వచ్చే నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. తమ పిల్లలను ప్రయివేటు బడికి పంపించాలంటే వేలకు వేలు ఫీజులు చెల్లించాలి.తరగతి ఏదైనా ఫీజులు మాత్రం వేలల్లో ఉంటున్నాయి. బడి ఫీజులు, బట్టలు, పుస్తకాలు, మెస్చార్జీలు, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.జిల్లాలో కార్పోరేటు స్థాయిలో నిర్వహించే పాఠశాలలు డీఈఓ నియంత్రణ చేయడం లేదు. మాకు మంత్రులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ అండదండలు ఉన్నాయంటూ… అధికారులన బెదిరిస్తున్నారు.ఇప్పటికైనా విద్యావిభాగంలో కార్పోరేటు బడులకు నియంత్రణ చేపట్టాలని విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
మరో పాతిక రోజుల్లో బడులు మొదలు కానున్నాయి. నేషనల్, అంతర్జాతీయ, ఇంగ్లీష్ మీడియం పేరుతో జిల్లాలో అనేక పాఠశాలలు నడిపిస్తున్నాయి. గతంలో జిల్లా కేంద్రంలోనే జాతీయ స్థాయి పాఠశాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మండలాల పరిధిలోనూ… ఇంగ్లీష్ మీడియంను బోధిరచే ప్రయివేటు పాఠశాలలు వచ్చాయి. శ్రీచైతన్య, కృష్ణవేణితో పాటు అనేక స్థానిక పాఠశాలలోచ్చాయి. ఒకటవ తరగతికి రూ. ఐదు 25 వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఇక రెండు, మూడు ఇలా పాఠశాల పెరిగినా కొద్ది ఫీజులు పెరుగుతాయి.10 వరకు వచ్చేసరికి లక్ష వరకు ఫీజు చెల్లించాల్సిందని యాజమాన్యం చేప్తుంది. .మహబూబ్నగర్ జిల్లాలో 859 పాఠశాలల్లో 79,594 మంది విద్యార్థులు చదువుతున్నారు.నాగర్కర్నూల్ జిల్లాలో 846 పాఠశాలల్లో 82,946 మంది, వనపర్తి జిల్లాలో 537 పాఠశాలల్లో 53,600 మంది, నారాయణపేట జిల్లాలో 511 పాఠశాలల్లో 70,601 మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో 475 పాఠశాలల్లో 71620 మంది చదువుతున్నారు. 505 ప్రయివేటు పాఠశాలల్లో 50 వేల మందికి పైగానే విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలాలో నాణ్యమైన విద్య అందదన్న కారణంతో ప్రయివేటు బడుల్లో చేర్చి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.ఫీజులే కాదు పాఠశాల డ్రస్లు, మెస్, రవాణా, ష్యూస్, టై, పుస్తుకాలు ఇలా అనేక రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏడాదికి ఒక్కో విధ్యార్థి నుండి లక్ష దాక వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేసే విధానానికి స్వస్థి పలకేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పదితో పాటు ఇంటర్, డిగ్రీతో పాటు ఇంజనీరింగ్, మెడిసన్, డిప్లామా, సాంకేతిక విద్య నభ్యసించే వారిపై ఏడాదికి ఐదు నుంచి పది లక్షల దాకా ఖర్చు అవుతోంది. అందుకే జూన్ నెల ప్రారంభం అయ్యిందంటే చాలు గుండెల్లో గుబులు రేకెత్తించినట్లుగా ఉంటుంది.
స్థానిక ఆధారంగా ఫీజులు లేవు.
పాలమూరు లాంటి వెనకబడిన జిల్లాల్లో ఫీజులు సైతం తక్కువగా ఉండాలని నిబంధనలున్నాయి. ఇక జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఉండే పాఠశాలలకు అదేస్థాయిలో ఫీజులు ఉండాలి. ఈ నిబంధనలేవి అమలులో లేవు. అధిక ఫీజుల విషయమైన పాఠశాలల్లో అడిగినా యాజమాన్యం హైదరాబాద్లో ఉండటం వల్ల మనకు సమాధానం దొరకదు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్ధు చేసి సామాన్యులను ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.
ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి
కార్పోరేటు స్థాయిలో విద్య అంటూ ఫీజులను విచ్చల విడిగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అక్కడి ఆర్థిక పరిస్థితులను బట్టి ఫీజులు వసూలు చేయాల్సింది. కాని ఆ నిబంధనలేవి అమలు కావడం లేదు. ఇప్పటికైనా స్థానిక ఆర్థిక పరిస్థితిని బట్టి ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్
ఫీజుల నియంత్రణపై ఎలాంటి నిబంధనలు రాలేదు
ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణపై ఎటువంటి విధానాలు రాలేదు.ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం వస్తేనే ప్రయివేటు ఫీజులపై చర్యలు తీసుకుంటాం.ప్రభుత్వ పరంగా పుస్తకాలు, బట్టలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం కాగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా తరగతులను నిర్వహిస్తాం.
– రవీందర్,డీిఈఓ మహబూబ్నగర్