ఈ ఆస్తికి వారసులు ఎవరు.?

– కోట్లు విలువ చేసే స్థలం.. గుడి పేరుతో కబ్జాకు యత్నం..!
– పట్టించుకోని రెవెన్యూ, మునిసిపల్ అధికారులు
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది. నివాస గృహాలు పెరుగుతున్నాయి. ఖాళీ స్థలాలకు తీవ్రమైన డిమాండ్ ఉంది. పట్టణ శివారులో అయితే   గజం స్థలం విలువ రూ.6. వేల నుంచి రూ.10 వేలు వరకు ఉంది. పట్టణంలో నివాస ఇండ్ల మధ్యలో అయితే.. గజం  స్థలం విలువ పదివేల వరకు ఉంటుంది. అలాంటిది పట్టణంలోని పాత బజార్ గాంధీ విగ్రహం ఎదురుగా దాదాపు 160 గజాలపై స్థలం గుడి పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పట్టణంలో చర్చ జరుగుతుంది.అసలు ఈ స్థలం ఎవరిది,రెవెన్యూ అధికారులు,  మునిసిపల్ అధికారులు, బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. ఇదే స్థలంలో మునిసిపాలిటీ స్వాధీనం చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది. కానీ అధికారులు ఈ దిశగా ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఓట్లు విలువ చేసే స్థలాన్ని దేవాలయానికి దార దత్తం చేయడానికి కుట్రలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్  నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ స్థలం ప్రభుత్వాన్ని అంటూ కొందరు పెద్ద మనుషులు చెబుతున్నారు. పాత భవనం ఉన్నప్పుడు ఇందులో బాలవికాస కేంద్రం , అంగన్వాడి కేంద్రం కొద్ది రోజులు రేషన్ డీలర్ షాప్ కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆస్తిని మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని పరువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజును నవతెలంగాణ వివరణ కోరగా.. ఆ స్థలం గుడికి సంబంధించిందని కొందరు చెబుతున్నారనీ, రికార్డుల వివరాలు అందుబాటులో లేవు తెలుసుకొని చెప్తాను అని తెలిపారు.

Spread the love