– ట్విట్టర్లో మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడమేంటని మాజీ మంత్రి టి హరీశ్రావు మంగళవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. గాంధీ భవన్వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు సంఘీభావాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వటం లేదని పేర్కొన్నారు.మంత్రులకు, అధికారులకు అభ్యర్థులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.