– మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
– ఆదివాసీ నాయకుల చిత్రపటాలకు ఘన నివాళులు
– విద్యతో ఉన్నత శిఖరాలకు చేరాలని యువతకు పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడెంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వేడుకల్లో ఆదివాసీ బిడ్డలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ చిన్నారులను ఘనంగా సన్మానించి, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఆదివాసీ యువత చదువులో ముందుండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. జమ్మిగూడెంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆదివాసీల ఐక్యతను ప్రతిబింబించడంతో పాటు విద్యా ప్రాధాన్యతను చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మిద్దిన వెంకట నర్సమ్మ,ఉప సర్పంచ్ దండి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య, కేసప్పగూడెం సర్పంచ్ భవాని, జెడ్పీటీసీ మాజీ సభ్యులు అంకత మల్లికార్జున్ రావు,అశ్వారావుపేట మున్సిపల్
కౌన్సిలర్ డాక్టర్. ఉదయ జ్యోతి – డాక్టర్ భూక్యా ప్రసాద్, కాసాని నాగ శేష పద్మ – చంద్రమోహన్, వగ్గెల పూజ, మాజీ సర్పంచ్లు మిద్దిన కొండయ్య, మిద్దిన రాములు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, జుజ్జూరపు శ్రీరామమూర్తి లు పాల్గొన్నారు.



