ఆదానీ వాదం…!

”ఏమండీ శ్రీవారు? టిఫిన్‌ తెచ్చాను తినండి!” అంటూ టిఫిన్‌ తెచ్చి ఆనంద్‌ ముందున్న టీపారు మీద పెట్టింది వందన.
”ఊఁ” అంటూనే ఫోన్‌ చూడటంలో మునిగిపోయాడు ఆనంద్‌. ఉఁ కొట్టాడు గాని టిఫిన్‌ మాత్రం చేయనే లేదు. కాసేపటికి శేఖర్‌ వచ్చాడు. ఆనంద్‌నూ, అతని ముందున్న టిఫిన్‌ ప్లేట్‌ను చూశాడు.
”ఏమిట్రా? టిఫిన్‌ చేయకుండా ఫోన్‌లో ఏం చేస్తున్నావు?” అడిగాడు శేఖర్‌.
”ఊ” అంటూ మళ్ళీ ఫోన్‌లో మునిగిపోయాడు.
”ఏమిటమ్మా వందనా, మీ ఆయన నీతో కోట్లాడాడా? ఏమీ మాట్లాడటం లేదు!” అంటూ శేఖర్‌ వందనను పిలిచాడు.
వందన లోపలి నుండి బయటకు వచ్చింది. భర్తనూ, టిఫిన్‌ ప్లేటునూ చూసింది.
”టిఫిన్‌ పెట్టి అరగంటైంది! తినలేదన్నా!” అన్నది వందన.
”ఎందుకురా వాడికిష్టమైన టిఫినే గదా!” అంటూ ఆనంద్‌ మొఖంలోకి చూశాడు. శేఖర్‌ వందననూ చూడమన్నాడు.
”ఆనంద్‌ మొఖంలో క్షణక్షణం రంగులు మారిపోతున్నాయి. ముఖంలో నవరసాలు కూడా తొణికిసలాడుతున్నాయి.
”అన్నా! మా ఆయనకేమయ్యింది!” అన్నది వందన భయంగా. శేఖర్‌ కూడా కంగారు పడ్డాడు. క్షణక్షణానికి ఆనంద్‌ మొఖంలో భావాలు మారుతుంటే ఏం చేయాలో తోచలేదు! ఇంతలో ”దేశద్రోహులు!” అన్నాడు ఆనంద్‌ ఫోను పక్కకుపెట్టి.
”ఎవరు మేమా!” అన్నాడు శేఖర్‌, వందనా జాయింటుగా.
”ఛ మీరు కాదురా! ఆదానినీ విమర్శిస్తున్న వారు!” అన్నాడు ఆనంద్‌ టిఫిన్‌ తింటూ.
”ఆదానీని ఎవరూ విమర్శించలేదు! వ్యాపారంలో మోసాలు చేశాడని తన సంపదను అక్రమంగా పెంచి చూపాడని అంటున్నారు!” అన్నాడు.
”అదేఁ, ఆ మాటన్నది ఎవరు? హిండెన్‌ బర్గే కదా! అది భారతీయ కంపెనా కాదు! విదేశీ కంపెనీ! ఆ కంపెనీ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీయాలని, ఉద్దేశపూర్వకంగా ఇలా దాడి చేస్తోంది!”
”భారతదేశాన్ని దెబ్బతీసే ఆ కంపెనీకి ఏం లాభం వస్తుంది? ఇలాంటి ఆరోపణలు ఇదే మొదటిసారి కాదగదా! ఇంతకు ముందే ఓ కంపెనీ ఇలాంటి ఆరోపణలు చేసింది! పైగా ఆస్ట్రేలియా, స్పెయిన్‌, శ్రీలంక దేశాలలో ఆదానికీ వ్యతిరేకంగా వీధి పోరాటాలు జరుగుతున్నాయి! కదా!” అన్నది వందన.
”నీవే చెబుతున్నావు. విదేశాలలో జరుగుతున్నాయని, అంటే, మన దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారన్న మాట! వారి వెనక ముస్లిం పాకిస్తానో, కమ్యూనిస్టు చైనానో ఉంటాయి” అన్నాడు ఆనంద్‌ ఆవేశంగా.
”విదేశాలలో నిరసన ప్రదర్శనలు చేసింది భారతదేశం మీద కాదు! ఆదానికి వ్యతిరేకంగా!” అన్నాడు శేఖర్‌.
”ఆదానీ అంటే ఎవరనుకున్నావు! భారతదేశానికి మారు రూపు! ఎందుకంటే ఈ దేశంలోని బొగ్గు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వేలు, వంటనూనెలు, విద్యుత్‌ ఇలా ఒకటేమిటి అన్నీ వ్యాపారాలు ఆదానీవే! ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ వ్యాపారమంటే అది ఆదానీ వ్యాపారమే! ఆదానీ వ్యాపారాన్ని దెబ్బతీయటమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటమే!” అన్నాడు ఆనంద్‌.
”మరి ఆదానీ అక్రమాలు చేస్తే, భారతదేశం కూడా అక్రమాలు చేసినట్టేనా?” ప్రశ్నించింది వందన.
”ఖామూష్‌! నా భారతదేశం పవిత్రదేశం! అలాగే ఆదానీ కూడా పవిత్రమైనవాడు తప్పు చేయడు! ఆదానీ ఎంత నిజాయితీపరుడో తెలుసా! ఎఫ్‌పిఒలో ఇన్వెస్టు చేసిన ఇరవై వేల కోట్లు తిరిగి మదుపరులకు ఇచ్చేశాడు?” అన్నాడు.
ఫక్కున నవ్వింది వందన! శేఖర్‌ కూడా నవ్వాడు.
”ఎందుకు నవ్వుతారు! ఇదుగో వాట్సప్‌ సాక్షం చూడండి!” అంటూ ఆనంద్‌ వాట్సప్‌ చూపాడు ఫోనులో.
”వాట్సప్‌ సాక్ష్యాలు ఎందుకులే గాని, ఎఫ్‌పిఒలో ఇన్వెస్టు చేసింది, జిందాల్‌, మిట్టల్‌, అంబానీ లాంటి కార్పొరేట్లే, వీళ్ళు ఆదానీకి సహాయం చేయటానికి డబ్బులు ఎఫ్‌పిఒలో ఇన్వెస్టు చేశారు! హిండెన్‌ బర్గ్‌ నివేదిక నేపథ్యంలో ఎఫ్‌పిఒకు స్పందన రాకపోతే నష్టం జరుగుతోందని గుర్తించి ఆదానీ స్నేహితులు పెట్టుబడులు పెట్టారు. వాటినే ఆదానీ తిరిగి ఇస్తున్నాడు.” వివరించాడు శేఖర్‌.
”తన ఆస్తులు విలువను మించి అప్పులు చేశాడని, ఆ ఆస్తులను అక్రమంగా పెంచి చూపాడని హిండెన్‌ బర్గ్‌ తప్పుడు రిపోర్టు ఇచ్చింది! ఏం పారిశ్రామిక వేత్తలు అప్పులు చేయకూడదా? అయినా తన ఆస్తులు కుదువ పెట్టి అప్పులు చేశాడు! ఇందులో తప్పేం ఉంది!” ప్రశ్నించాడు ఆనంద్‌.
”ఎవరైనా అప్పులు చేయటం తప్పేం కాదు! ఆస్తులు కుదువ పెట్టి తప్పు చేయటం కూడా తప్పుకాదు! అయితే నీ వద్ద ఉన్న బైక్‌ విలువ లక్ష రూపాయలైతే, ఆ బైక్‌ కుదువబెట్టి పది లక్షలు అప్పు తేవటం తప్పు! ఇలా చేయటంలో మతలబు ఏమిటో చెప్పనా?” అడిగాడు శేఖర్‌.
”ఇందాక నీవు చెప్పినట్లు ఆదాని వద్ద నున్న విమానా శయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు, విద్యుత్‌ లాంటి ఈ దేశ ప్రజల సొంతం! అవిప్పుడు ఆదానీ స్వాధీనంలో ఉన్నాయి. వాటిని కుదువపెట్టి లక్షల కోట్లు అప్పు చేసి, ఆ అప్పు చెల్లించకపోతే ప్రజల ఆస్థి ఏమవుతుంది? అంతే కాదు! అప్పులిచ్చిన సంస్థలు కూడా దెబ్బ తింటాయి కదా! అన్నాడు శేఖర్‌.
”ఇదంతా ఫేక్‌! ఆదానికి అప్పులిచ్చిన ఎస్‌బిఐ, ఎల్‌ఐసి దివాళా తీశాయా? లేదు కదా! ఆదానికి అప్పులిచ్చినా, పెట్టుబడులు పెట్టినా దివాళా తీయలేదు! ఇప్పటికీ లాభాలే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా తగ్గాయి! అంతే! అయినా ఆదానీ మీద ఆసూయతో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా బద్నాం చేస్తున్నారు! మెల్లిగా వీరిద్దరూ దేశ ద్రోహుల లిస్టులో చేరిపోతున్నారు!” అంటూ అనుమానంగా చూశాడు ఆనంద్‌.
”ఎస్‌బిఐ, ఎల్‌ఐసిలు చాలా పెద్ద ఆర్థిక సంస్థలు! ఆదానీ వల్ల నష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలవు! కాని విషయమేమిటంటే ప్రజల ఆస్థులను కుదువబెట్టి, ప్రజలకు చెందిన ఆర్థిక సంస్థల వద్ద నిధులు సేకరించి, ఒక ప్రయివేటు వ్యక్తి ఆస్తులు పోగేసుకోవటం మోసం కాదా! నీవు చెప్పినట్లు లాభాలు తగ్గాయంటే, అదీ ప్రజలవే కదా! అంటే ప్రజలే నష్టపోయారు!” అన్నాడు శేఖర్‌.
ఆనంద్‌ మాట్లాడకుండా ఫోన్‌లో తల దూర్చాడు. తర్వాత తలెత్తి ఇద్దరికీ ఫోను చూపాడు. ”ఈ ఎనలిస్టు చెప్పేది వినండి, హిండెన్‌ బర్గ్‌ కమిటీకే విశ్వసనీయత లేదు! ఆ కంపెనీ చెప్పేవాటికి ఏం విశ్వసనీయత ఉంటుందీ! ఎలాంటి పరిశోధన చేయకుండా ఆదానీ మోసం చేశాడని చెప్పి, దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని చూస్తున్నారు.”
”ఆ కంపెనీకి విశ్వసనీయత ఉందా లేదా అన్నది పాయింట్‌ కాదు! ఆ కంపెనీ చెప్పిన విషయాలకు విశ్వసనీయత ఉందా లేదా అన్నది పాయింట్‌. ఆ కంపెనీ 84 ప్రశ్నలు వేసింది. ఒక్క ప్రశ్నకూ ఆదానీ జవాబు చెప్పలేదు. మన దేశంలో తన మీద ఆరోపణలు చేసిన జర్నలిస్టుపై వందల కోట్లు పరువునష్టం దావా వేసే ఆదానీ, ఈ రోజు వరకు హిండెన్‌ బర్గ్‌ మీద దావా వేయలేదేం! పైగా ఆ కంపెనీ కూడా కేసు వేయమంటున్నది కదా!” అన్నది వందన.
”డౌటేం లేదు! మీరు దేశద్రోహులై పోయారు!” అన్నాడు ఆనంద్‌.
”బ్రిటిష్‌వాడిని ప్రశ్నించిన స్వాతంత్రయోధు లందర్నీ దేశద్రోహులని ముద్ర వేసింది బ్రిటిష్‌ ప్రభుత్వం! అదలా ఉంచుదాం! ఆదానీ మీద ఇన్ని ఆరోపణలువస్తుంటే, ఈడి, సిబిఐ, ఎస్‌ఈబిఐ లాంటి సంస్థలు కిమ్మనటం లేదు! చిన్న, చిన్న విషయాలపై కూలంకుశంగా పరిశోధనలుచేసే ఈ దర్యాప్తు సంస్థలు కళ్ళు, చెవులు, నోరూ అన్నీ మూసుకున్నాయేం? ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, మాట వరసకైనా విచారిస్తాం అనటం లేదేమి? పోనీ హిండెన్‌బర్గ్‌ నివేదిక తప్పని చెప్పటం లేదేమి?” నిలదీసింది వందన.
ఆనంద్‌ మళ్ళీఫోన్‌లో తల దూర్చాడు.

Spread the love