ఐపీఎల్‌ హంగామా 59 రోజులు

–  మార్చి 31న తొలి మ్యాచ్‌, మే 28న ఫైనల్‌
– ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16 షెడ్యూల్‌ విడుదల
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 షెడ్యూల్‌ వచ్చేసింది. 10 జట్లు పోటీపడుతున్న ఐపీఎల్‌ 16 సీజన్‌ 59 రోజుల పాటు జరుగనుంది. వారాం తాల్లో రెండు మ్యాచులు నిర్వహిం చనున్న సీజన్‌లో లీగ్‌ దశలో 70 (ఓవరాల్‌గా 74) మ్యాచులు జరుగనున్నాయి. మార్చి 31న డిఫెండింగ్‌ చాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మే 28న అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్‌ 16 ఫైనల్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐపీఎల్‌ నిర్వాహకులు శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. ఐపీఎల్‌ 16 ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. ఇక రెండేండ్ల విరామం అనంతరం ఐపీఎల్‌ ఇంటా, బయటా ఫార్మాట్‌లో జరుగనుంది.
రెండు గ్రూపులే, కానీ కొత్తగా!
: పది జట్ల ఐపీఎల్‌ లీగ్‌ను గతంలో తరహాలోనే రెండు గ్రూపులు విభజించారు. కానీ గతంలో సొంత గ్రూప్‌లోని జట్లతో రెండు సార్లు, ఆవల గ్రూప్‌తో ఓ సారి ఆడేవారు. కానీ ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా ఆడనున్నారు. సొంత గ్రూప్‌లోని జట్లతో ఓ మ్యాచ్‌లో ఆడనుండగా, మరో గ్రూప్‌లోని జట్లతో రెండేసి మ్యాచుల్లో తలపడతాయి. గ్రూప్‌-ఏలో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చోటు చేసుకున్నాయి. లీగ్‌ దశలో ప్రతి జట్టు 14 మ్యాచులు ఆడనున్నాయి.
ఏప్రిల్‌ 2 నుంచి హైదరాబాద్‌లో.. : ఐపీఎల్‌ హంగామాకు రెండేండ్లు దూరమైన హైదరాబాద్‌ ఈ ఏడాది కొత్తగా ముస్తాబవుతోంది. ఐపీఎల్‌ 16 సీజన్‌ మ్యాచులు హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 2 నుంచి ఆరంభం కానున్నాయి. 2022 రన్నరప్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌ను ఆరంభించనుంది. ఏప్రిల్‌ 9న పంజాబ్‌ కింగ్స్‌, 18న ముంబయి ఇండియన్స్‌, 24న ఢిల్లీ క్యాపిటల్స్‌, మే 4న కోల్‌కత నైట్‌రైడర్స్‌, 13న లక్నో సూపర్‌జెయింట్స్‌, 18న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై ఆడనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఒకే మ్యాచ్‌లో తలపడనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆ మ్యాచ్‌ను చెన్నై చెపాక్‌లోనే ఆడనుంది. దీంతో ఎం.ఎస్‌ ధోని చివరి ఐపీఎల్‌ సీజన్‌లో హైదరాబాద్‌కు రావటం లేదు!.

Spread the love