ప్రభుత్వ బడుల్లో పెరిగిన విద్యార్థులు

–  మన ఊరు మనబడితో మరింత మంది చేరే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన సామాజిక, ఆర్థిక సర్వే-2023 గణాంకాల ప్రకారం ఏడాది కాలంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు సర్కారు బడుల్లో అదనంగా నమోదయ్యారు. ఈ మేరకు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2020-21లో ఉన్న 41,220 నుంచి 2021-22లో 41,369కు పెరిగాయి. 2020-21లో 60.40 లక్షల మంది విద్యార్థులుంటే, 2021-22లో 62.30 లక్షలకు పెరిగారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన, సాఫ్ట్‌స్కిల్స్‌ ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదవు తున్న విద్యార్థుల శాతం 2019-20లో 42.91 శాతం, 2020-21లో 43.47 శాతం,2021-22లో 49.77 శాతంగా ఉన్నదని పేర్కొన్నారు. అంటే నమోదు శాతం ఏటా పెరుగుతున్నదని తెలిపారు. ఇదే కాలంలో ప్రయివేటు పాఠశాలల్లో 2019- 20లో 57.09 శాతం, 2020-21లో 56.53 శాతం, 2021-22లో 50.23 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. అంటే ప్రయివేటు పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా తగ్గిందని వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి వెళ్తున్న విద్యార్థుల శాతం దేశవ్యాప్తంగా సగటున 3.83 శాతం ఉంటే, రాష్ట్రంలో 7.48 శాతం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మన ఊరు-మనబడి కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరగనుందని పేర్కొన్నారు. మూడేండ్ల వ్యవధిలో రూ.7,289.54 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 26,065 పాఠశాలలు అబివృద్ధి చెందుతాయని తెలిపారు. మొదటి దశలో రూ.3,497.62 కోట్లతో 14,71,684 మంది విద్యార్థులు చదువుతున్న 9,123 పాఠశాలలను ప్రభుత్వ ం అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండొద్దనే సీఎం కేసీఆర్‌ భావించి ప్రత్యేకంగా ఈ కార్యక్ర మాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఇది విజయవంతమైతే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు.

Spread the love