బాధ్యత కలిగిన వ్యక్తులుగా…

అతి వేగంగా కాలం మారిపోతోంది. సామాన్య జీవితాలు సైతం వేగం పుంజుకుంటున్నాయి. ఆధునిక జీవనశైలి, సరికొత్త వ్యవహార శైలి, సెల్‌ ఫోన్లు, లాప్టాప్‌లు, ఐపాడ్లు వగైరాలతో పిల్లలు ప్రాపంచిక విజ్ఞానంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం తీరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే పిల్లలను చదువులోనే కాక, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆధునిక విజ్ఞానంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పడం వల్ల వారిని తమకు, తమ కుటుంబానికే కాక సమాజానికి కూడా ఉపయోగపడగల బాధ్యత కలిగిన వ్యక్తులుగా మార్చడానికి వీలుంటుంది. మానసిక నిపుణుల ప్రకారం ఇందుకు కొన్ని మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. వారి పెంపకం మీద మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. చదువులతోపాటు పిల్లలకు సంస్కారాన్ని నేర్పడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
పిల్లల కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించడం, ఇందుకు ప్రత్యేకంగా ప్లాన్‌ వేసుకోవడం సాధ్యం కాని విషయం. ఇటువంటివి సహజంగా జరిగి పోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇంట్లో లేదా కుటుంబాల్లో ఏది చేసినా అందరూ కలిసే చేయటం వల్ల ఆశించిన ప్రయోజనం కలుగుతుంది. టీవీ చూడటం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండటం చాలా అవసరం. కబుర్లు చెప్పుకున్నా, భోజనం చేసినా, సినిమాకు పోయినా, బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్లినా అంతా కలిసే చేయటం వల్ల పిల్లలలో ఒక విధమైన సామాజిక స్పృహ ఏర్పడుతుంది. సామాజిక పరిస్థితుల పట్ల వారికి అవగాహన ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం పిల్లల ముందు చేయకపోవడం మంచిది. వారిలో అందరి పట్ల సమభావం పెరగటానికి ఇది అవరోధంగా మారుతుంది. ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం వల్ల పిల్లలలో మహిళల విషయంలో సద్భావం ఏర్పడుతుంది. ఏ విషయం అయినా వారికి ప్రత్యేకంగా చెబుతున్నట్టు కాకుండా సందర్భ వశాత్తు చెబుతున్నట్టుగా చెప్పాలి. తరచూ సూక్తులు, హితోక్తులు చెప్పడం వల్ల వారిలో వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్న వయసు నుంచే వారిలో వారు బడుగు వర్గాల పట్ల ఔదార్యంతో, ఆదర భావంతో వ్యవహరించే వీలుంటుంది. వారిలో ఒకపక్క పోటీ తత్వాన్ని పెంచుతూనే ఇతరుల పట్ల సానుభూతితో, సహనంతో వ్యవహరించడం నేర్పాలి.
ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగిన కుటుంబం యావత్తు అందులో పాల్గొనేలా చూడాలి. వాటి అర్ధాన్ని, ప్రయోజనాన్ని వారికి కొద్దికొద్దిగా తెలియజేస్తూ ఉండాలి. ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో అందరి పాత్ర ఉండే విధంగా వ్యవహరించాలి. ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు అది తప్పనిసరిగా పిల్లల దృష్టిలో పడేలా చేయడం మంచిది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, చివరికి పక్కింటి వారికి సహాయం చేస్తున్నా దాన్ని పిల్లలకు తెలిసేలా చేయాలి.
వారి సమక్షంలో వాదించుకోవడం, దుర్భాషలాడటం వంటివి చేయడం మంచిది కాదు. అటువంటివి చేయడం వల్ల వారిలో ఆత్మ న్యూనతా భావం పెరుగుతుంది.

Spread the love