ముంబయి : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 18.5 శాతం వృద్థితో రూ.11,672 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,853 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.31,021.13 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ4లో 22.33 శాతం పెరిగి రూ.37,948 కోట్లకు చేరింది. కాగా.. 2023-24కు గాను ప్రతీ ఈక్విటీ షేర్పై రూ.10 డివిడెండ్ ప్రతిపాదనకు ఆ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికం ముగింపు నాటికి 2.3 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు.. మార్చి ముగింపు నాటికి 2.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్పిఎలు 0.44 శాతం నుంచి 0.42 శాతానికి పరిమితమయ్యాయి.