137 మంది భార‌తీయుల అరెస్ట్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: సైబ‌ర్ స్కామ్‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై 137 మంది భార‌తీయుల‌ను శ్రీలంక అరెస్ట్ చేసింది. కొలంబోలోని మ‌డివేలా, బ‌త్త‌ర‌ముల్లా, నెగొంబా ప్రాంతాల్లో వీరంద‌రిని అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి ఎస్‌ఎస్‌పీ నిహాల్ తల్దువా తెలిపినట్లు డైలీ మిర్రర్ వెల్ల‌డించింది. ఈ మూడు ప్రాంతాల్లో సీఐడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వ‌ద్ద నుంచి 158 మొబైల్ ఫోన్లు, 16 ల్యాప్‌టాప్‌లు, 60 డెస్క్‌టాప్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. నెగొంబాలో 55 మంది అనుమానితులతో పాటు 55 మొబైల్ ఫోన్లు, 29 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొచ్చికాడేలో అధికారులు 53 మందిని అదుపులోకి తీసుకుని వారి వ‌ద్ద నుంచి 31 ల్యాప్‌టాప్‌లు, 58 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మడివేలలో చేపట్టిన ఆపరేషన్‌లో 13 మంది అనుమానితులను అరెస్టు చేసి, 8 ల్యాప్‌టాప్‌లు, 38 మొబైల్ ఫోన్‌లను సీజ్ చేశారు. తలంగమలో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, 8 ల్యాప్‌టాప్‌లు, 38 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరు బెట్టింగ్‌, జూదం, ఆర్థిక అవ‌క‌త‌వ‌ల‌క‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి, ఆఫ్ఘ‌నిస్థాన్‌లోనూ వీరు త‌మ కార్యక‌లాపాలు కొన‌సాగిస్తున్న‌ట్లు గుర్తించారు.

Spread the love