నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. బాలేశ్వర్ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానున్నట్లు చెప్పారు. మరోవైపు విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలేశ్వర్ వెళ్తోందని చెప్పారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని అన్నారు. శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలోఅనూహ్య రీతిలో మూడు రైళ్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే.షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు నుంచి హావ్డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. రైళ్లు అతివేగంతో వెళ్లడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. అంతేబలంగా కిందికి పడిపోవడంతో వాటితోపాటు పట్టాలు ధ్వంసమయ్యాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 278 మందికి పైగా మృతి చెందగా.. వందలాది మందికి గాయాలయ్యాయి.