ఉధృతంగా కార్మికుల జాతీయ సార్వత్రిక సమ్మె
బ్రస్సెల్స్ : బెల్జియంలో కార్మికులు మంగళవారం నిర్వహించిన జాతీయ సమ్మెతో దేశం స్తంభించిపోయింది. దేశంలో రవాణా, ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాశ్రయాలను మూసేసారు. యూరప్లో రెండో అతిపెద్ద ఓడరేవు ఆంట్వెర్ప్లో షిప్పింగ్ ఆగిపోయింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎఫ్జిటిబి, ఎసివి, సిఎస్సి, ఎబివివి కార్మిక సంఘాలు ఈ జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.. రాజధాని బ్రస్సెల్స్లో లక్షకు పైగా కార్మికులు భారీ ప్రదర్శనను నిర్వహించారు. మన హక్కుల కోసం.. మన పోరాటం అని నినదించారు. ఈ ర్యాలీని సెంట్రల్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్తంగా మారింది. పోలీసులు వాటర్ ఫిరంగులు, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించడంతో అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమ్మెలో ఉపాద్యాయులు, విద్యార్థులు, జైళ్ల సిబ్బంది, పోస్టల్ కార్మికులు, నౌకా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమ్మె ఎందుకు ?
బెల్జియంలో ప్రధాన మంత్రి బార్డ్ డి వేవర్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలపై భారాలు తగ్గిస్తానని ప్రచారం చేసిన డి వేవర్ ప్రధాని అయిన మాత్రం సంక్షేమానికి కోతలు పెడుతున్నారు. కార్మికుల పెన్షన్లను తగ్గించే సంస్కరణలను తీసుకువచ్చారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న యానియన్లలో ఒకటైన ఎఫ్జిటిబి కార్మిక నాయకుడు థీయరీ బోడ్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని డి వేవర్ కార్మిక వ్యతిరేక విదానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. పెన్షన్ల వయోపరి మితిని 67 ఏండ్లకు పెంచడం, పెన్షన్ పొందేందుకు అదనపు రోజులు పని చేయాలని ప్రతిపాదించడం అన్యాయ మన్నారు. బడ్జెట్ లోటు పేరుతో కార్మికుల సంక్షేమానికి కోతలు పెట్టడం సరికాదన్నారు. ప్రభత్వం దిగిరాకపోతే మరిన్ని సమ్మెలు తప్పవని హెచ్చరించారు. ఈ సమ్మెలో సోషలిస్టు ఎంపి మార్టిన్ కాసియర్ పాల్గొని మద్దతు తెలిపారు. కార్మికులు సామాజిక వ్యతిరేక, మితవాద చర్యల ఉపద్రవాన్ని ఎదుర్కోంటున్నారని, ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికులనే టార్గెట్ చేస్తుందని విమర్శించారు.