ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ విజన్ -2047 పౌర సర్వేలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రానున్న
రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంటును రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న విజన్ తయారీలో పౌరులందరూ భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టామని తెలిపారు. అక్టోబర్ 10న ప్రారంభమైన సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలో ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఈనెల 25 వరకు జరిగే సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనడంతోపాటు సర్వే లింక్ కోడ్ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సర్క్యులర్లో ఆదేశించారు.