కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 56 దరఖాస్తులను స్వీకరించారు. గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన కందాల శాంతమ్మ దరఖాస్తు అందిస్తూ భర్త కృష్ణా రెడ్డి మృతి చెందారని, వికలాంగురాలు అయినందున 4ఎకరాల 32 కుంటల భూమి తనకు తెలియకుండా ఇద్దరు కొడుకులు వాళ్ళ పేర్లపై మార్చుకున్నారని, ఇల్లు కూడా విక్రయుంచుకున్నారని, తనను చూడడం లేదని తన భూమి తనకు ఇప్పించాలని కోరారు. భువనగిరి మండలం గౌస్ నగర్ కు చెందిన సి.హెచ్. మల్లారెడ్డి తన దరఖాస్తును అందిస్తూ సర్వే నెంబరు 144, 147లలో 17 ఎకరాల 26 గుంటల భూమి ఉందని ప్రక్కనే 148 సర్వేనెంబర్ లోని పల్లెర్ల మైసయ్య, యాదమ్మ, జంగం వెంకమ్మ, కందుకూరి జయమ్మ, వెల్వెర్తి పోచమ్మ, నల్లెర్ల చంద్రయ్య లు తన భూమిని ఆక్రమిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి మండలం ఎల్బీనగర్ కు చెందిన బాలమణి తన భర్త చనిపోయాడని రేషన్ కార్డులో తన కొడుకు పేరు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. హనుమపురం కు చెందిన ఎర్రబోయిన ఆండాలు భర్త పెద్ద నరసింహ పింఛన్ రావడంలేదని కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నామని దరఖాస్తు అందించారు. మోత్కూరు మండలం పొడిచెడు గ్రామానికి చెందిన మార్పాక స్వామి తనకు వారసత్వంగా వచ్చిన ఎకరం పావు భూమి ధరణిలో ఇతరుల పేరుపై నమోదయిందని తన పేరుపై చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ , జిల్లా పంచాయతీ శాఖ , సర్వే ల్యాండ్స్ , హౌసింగ్ , ఆర్.టి.సి , లేబర్, విద్య శాఖ, ఇంటర్మీడియట్ , జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలకు దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు.అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ పభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి సంక్షేమ పథకాలను మండల స్పెషల్ అధికారులు గ్రామాలలో తిరిగి అర్హులైన లబ్ధిదారుల ను ప్రోత్సహించాలని, ఇండ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ పూర్తి అయితే ప్రభుత్వం మీ తదుపరి కట్టుబడికి లక్ష రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తుందని , ఆ తదుపరి 2 లక్షలు జమ చేస్తుందని తెలియజేసి ప్రతి ఒక్క పేద కుటుంబం ఇళ్ళు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని, రాజీవ్ యువ వికాస్ పథకం కింద 50 వేల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు రుణాలు పొందేందుకు అవకాశం ఉన్నందున అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంక్ అధికారులను ఒప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈఓ శోభా రాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి…
- Advertisement -
- Advertisement -