మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామం శివార్లో చంద్రయ్యగారి భూమిలో కొత్త రాతిచిత్రాలతావును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహౌబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరివి గోపాల్ గుర్తించారు. ఈ తావును బందం సభ్యులతో కలిసి సందర్శించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, కో-కన్వీనర్లు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్ మిత్రుడు కె.జయంత్ ఈ రాతిచిత్రాలను విశ్లేషించారు.
రెండురాతిగుండ్ల మీద పేర్చిన రాతిబండలెక్క కనిపించే ఈ శిలాశ్రయం నేలమీదనే ఉంది. ఈ తావులో కనిపించిన రాతిచిత్రాలు ఎరుపురంగులో వున్నాయి. వీటిలో ఎడమవైపు రాతిగుండుపై వేసిన చిత్రాలలో ఒక దేవుని రథం, దానికి కట్టిన రెండెద్దులు, ఒకవైపు ముగ్గుపట్టీ అలంకరణ, మరొకవైపు తీగెలవాద్యాన్ని భుజంపై పెట్టుకుని వాయిస్తున్న కళాకారుడు కనిపిస్తున్నారు. కుడివైపు రాతిగుండు మీద ఒక రాక్షసునివంటిబొమ్మ, మరొకటి వీరునిబొమ్మ పోరుచేస్తున్నాయి. వీటికి పైన పెద్దతోక కోతిబొమ్మ (హనుమంతుడు) కనిపించింది. అన్నింటిపైన సర్పంవంటి పొడవైన గీతగీసి వుంది.
రాతిచిత్రాలలో తంత్రీవాద్యంతో కళాకారుడు కనిపించడం ఇదే ప్రథమమన్నారు బీవీభద్రగిరీశ్. ఈ రాతిచిత్రాలన్నీ మధ్యచారిత్రకకాలానికి చెందినవని గుర్తించామని శ్రీరామోజు హరగోపాల్ అన్నాడు.
రాతిచిత్రాలతావుకు 50అడుగుల దూరంలో మధ్యరాతియుగానికి చెందిన సూక్ష్మరాతిపనిముట్లు (మైక్రోలిథ్స్) దొరికాయి. మరికొంచెం దూరంలో పెద్దరాతిగుండుమీద పట్టీలవంటి గీతలు, మనిషి రూపం పెట్రోగ్లైఫ్స్ అగుపించాయి.
ఫీల్డ్ రీసెర్చ్ : అహోబిలం కరుణాకర్, మొహమద్ నసీరుద్దీన్, కొరివి గోపాల్, కొత్త తెలంగాణ చరిత్రబృందం
రాక్ పెయింటింగ్ ఎనాలసిస్ : శ్రీరామోజు హరగోపాల్, బి.వి.భద్రగిరీష్, కె.జయంత్, కొత్త తెలంగాణ చరిత్రబృందం
వెంకటాయపల్లిలో చారిత్రకకాలపు రాతిచిత్రాలతావు
- Advertisement -
- Advertisement -



