నకిలీ విత్తనాల సరఫరాదారులపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సోయా రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. వానాకాలం సాగుపై ఎంతో ఆశతో అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన సోయా విత్తనాలను పొలాల్లో విత్తినప్పటికీ, ఇప్పటివరకు మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సాధారణంగా కొద్ది రోజుల్లో మొలకలు రావాల్సిన విత్తనాలు భూమిలోనే కుళ్లిపోవడం లేదా అసలు మొలకెత్తకపోవడం జరిగిందని తెలిపారు.
నకిలీ విత్తనాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని” రైతులు కలెక్టర్ను కోరారు. రైతుల సమస్యలను ఓపికగా విన్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, లక్ష్మీపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి మొలకెత్తని సోయా పంటపై పూర్తి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నకిలీ లేదా నాసిరకం విత్తనాల సరఫరా జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ అధికారులు, లక్ష్మీపూర్ గ్రామ రైతులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.



