- – జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలో ఇటీవల కాలంలో జరిగిన దొంగతనాలను అరికట్టాలని జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన వడపర్తి గ్రామంలో మేడబోయిన బాలయ్య గొర్రెల దొంగతనం జరుగగా, దొంగతనం జరిగిన ప్రదేశాన్ని జిఎంపిఎస్ ఆధ్వర్యంలో పరిశీలించి, మాట్లాడారు. మేడపోయిన బాలయ్య రోజువారి కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం గొర్రెలను మేపుకొచ్చి గొర్రెలను గొర్రెల పాకలో తోలి ఇంటికి వెళ్లి, వర్షం వస్తుందని తిరిగి రాలేదు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 100 గొర్రెలను దొంగతనం చేశారని అన్నారు.
వడపర్తితో పాటు బుధవారం రాత్రి అనాజిపురం గ్రామంలో బొల్లెపల్లి ప్రవీణ్ కు చెందిన మూడు మేకలు గ్రామంలోని ఇంటి ముందు నుంచి దొంగతనం చేశారు. పోలీసులు మండల వ్యాప్తంగా గొర్రెల కాపరులను గుర్తించి వారికి గొర్రెల దొంగతనాలపై అవగాహన కల్పించాలని , పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం జరిగిన సంఘటనపై స్పెషల్ టీం ఏర్పాటు చేసి గొర్రె కాపరి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం, మండల కార్యదర్శి పాక జహంగీర్, వడపర్తి సొసైటీ అధ్యక్షులు ఉడుత జంగయ్య, మన్నేవారి పంపు సొసైటీ అధ్యక్షులు మేడబోయిన సురేష్, గొర్రెల కాపరి కుటుంబ సభ్యురాలు మేడబోయిన తిరుపతమ్మ, గ్రామస్తులు , గొర్రెల కాపరులు పాల్గొన్నారు.



