‘పెద్ది’ సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. ఆర్ఆర్ఆర్ను కూడా మించి ఉంటుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి అని చెప్తున్నా. 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగతా భాగం మరింత అద్భుతంగా ఉంటుంది’ అని సినీ నటుడు రామ్చరణ్ అన్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీకపూర్ కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కోసం రామ్చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల వెళ్లారు. రామ్చరణ్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం ఫ్యాన్స్మీట్లో ఆయన మాట్లాడారు. ”పెద్ది’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పంచుకున్నారు. ఉత్తరాంథ్ర ప్రాంత గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా. ‘రంగస్థలం’ తర్వాత రామ్చరణ్ ఈ జోనర్లో చేస్తున్న సినిమా ఇదే. కన్నడ నటుడు శివరాజ్కుమార్, మీర్జాపూర్ మున్నా భయ్యా దివ్యేన్దు, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలారు భారీబడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.