జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి
ఉత్తర్వులను సవరించిన విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) షెడ్యూల్ ను పాఠశాల విద్య సంచాలకులు, టీజీటెట్ చైర్పర్సన్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ విడుదల చేశారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరిస్తా రు. ఈ నెల 29 వరకు టెట్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2026 జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇవ్వగా, తాజాగా ఆ ఉత్తర్వులను విద్యాశాఖ సవరించింది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించారు.
అంతకుముందు నియమితులై సర్వీసు కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు సాధించాల్సి ఉన్నది. కాగా, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేండ్లలో అంటే 2027 నాటికి ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. అయితే ఐదేండ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని మినహాయింపునిచ్చింది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి, టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
టెట్ ఫీజును తగ్గించాలి
ఉపాద్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు ఫీజు గతంలో వలె రూ.1,000 కాకుండా ఈ సారి తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ టెట్ పేరుతో ఫీజును పెంచడం నిరుద్యోగులకు ఆర్థిక భారంగా ఉందని ఆ సంఘం పేర్కొంది.



