Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంపెట్టుబడులకు ముఖద్వారం హైదరాబాద్‌

పెట్టుబడులకు ముఖద్వారం హైదరాబాద్‌

- Advertisement -

మౌలిక వసతులు, భద్రతకు ఢోకా లేదు : యూఎస్‌ఐఎస్పీఎఫ్‌ వార్షిక సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి
ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు ఆహ్వానం..
రోడ్లకు గూగుల్‌, మెటా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీ పేర్లు పెడతామని వెల్లడి
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టత
తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌పై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ ముఖ ద్వారమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామికy ేత్తలను ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావ రణం, భద్రతకు ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో హైదరాబాద్‌ ఉందన్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు హైదరాబాద్‌ ఉత్తమ గమ్యస్థానమని చెప్పారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అనువైనదిగా ఉందన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌ షిప్‌ ఫోరం (యూఎస్‌ఐఎస్పీఎఫ్‌) సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌పై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ప్రపంచ వేదికపై తెలంగాణ అభివద్ధికి దోహదపడుతున్న అంశాలను హైలైట్‌ చేయడంతో పాటు అమెరికా-ఇండియా వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. అలాగే రైజింగ్‌ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలమైన అంశాలు, భవిష్యత్‌ ప్రణాళికలు, ప్రభుత్వ ఆలోచనలను వారితో పంచుకోనున్నారు. హైదరాబాద్‌ వేదికగా ప్రభుత్వం చేపడుతున్న గేమ్‌చేంజర్‌ ప్రాజెక్టులు, అమెరికన్‌ కంపెనీలకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో భాగస్వామ్యం చేసే అంశాలను వివరించారు. ఇదే సందర్భంలో ‘చైనా ప్లస్‌ 1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అలాంటి భవిష్యత్‌ ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని పలు కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు ఆహ్వానం
మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణలో గత 35 ఏండ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా… పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని సీఎం గుర్తు చేశారు. హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్‌ సౌత్‌) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. అందువల్ల ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించారు.

దేశంలోనే నూతన నగరంగా ఫ్యూచర్‌ సిటీ
ఈ సందర్భంగా గత 23 నెలల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ ఫ్యూచర్‌ సిటీ భారత దేశంలోనే నూతన నగరంగా మారుతుందని యూఎస్‌ఐఎస్పీఎఫ్‌ ప్రతినిధులకు వివరించారు. మూసీ నదీ పునరుజ్జీవం పూర్తయితే లండన్‌, టోక్యో, దుబారు, సియోల్‌ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్‌ నైట్‌ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. డ్రై పోర్ట్‌, మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్‌, రేడియల్‌ రోడ్లు, ఓఆర్‌ఆర్‌-త్రిపుల్‌ ఆర్‌ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు. చైనా ం1 మోడల్‌కు గ్లోబల్‌ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు.

ట్రెండ్‌ మార్చుతాం… రోడ్లకు కంపెనీల పేర్లు పెడతాం…
భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా పొలిటికల్‌ లీడర్ల పేర్లు ఉంటాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఈ ట్రెండ్‌ మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇకపై ప్రధాన రోడ్లకు గూగుల్‌, మెటా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ కంపెనీ పేర్లు పెడతామని స్పష్టం చేశారు.

సీఎం విజన్‌పై టెక్‌ దిగ్గజాల ప్రశంసలు..
యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం (యూఎస్‌ఐఎస్పీఎఫ్‌) సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి విజన్‌పై టెక్‌ దిగ్గజాలు ప్రశంసలు కురిపించాయి. తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనలను అభినందించాయి. యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగం, ప్రజెంటేషన్‌ విశేష ఆదరణ పొందింది.

రేవంత్‌ రెడ్డి విజన్‌ బోల్డ్‌, క్లియర్‌, అచీవబుల్‌…
తెలంగాణను అభివద్ధి పథంలో నడిపిస్తూ… అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలన్న సీఎం విజన్‌ అన్ని కోణాల్లో స్పష్టంగా ఉందని పలువురు టెక్‌ దిగ్గజాలు కొనియాడారు. ‘సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ విజన్‌ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్‌), సాధించగలిగేలా ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది.’
-జాన్‌ ఛాంబర్స్‌, సిస్కో మాజీ సీఈఓ, టెక్‌ దిగ్గజం

గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరవుతాం..
సీఎం ప్రజెంటేషన్‌ తర్వాత హైదరాబాద్‌ వేదికగా వచ్చే నెల డిసెంబర్‌ 8, 9 తేదిల్లో తెలంగాణ రైజింగ్‌లో సమ్మిట్‌కు హాజరవుతామని పలు అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ‘సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు మా సభ్యులలో ఎక్కువ మంది డిసెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరవుతాం. తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసు కోవాలని మేమంతా ఆసక్తిగా ఉన్నాం.’
-డాక్టర్‌. ముఖేష్‌ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -