ఆ మేరకు రోడ్మ్యాప్ సిద్ధం : ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్బాబు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
‘ఏరో ఇంజిన్ రాజధాని’గా 2030 నాటికి తెలంగాణను తీర్చిదిద్దేందుకు రోడ్మ్యాప్ను సిద్ధం చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దీనికోసం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ‘ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్’ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, ఐఎస్బీ, ముంజాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంయుక్తాధ్వర్యంలో శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో నిర్వహించిన ‘ఆత్మనిర్భర్ భారత్ సాధికారత’ అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాల వల్ల గ్లోబల్ సప్లరు చెయిన్ ఒత్తిడికి గురవుతుందనీ, ఈ తరుణంలో విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం ప్రపంచం భారతదేశంవైపు చూస్తోందన్నారు. గతేడాది దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు. రక్షణ రంగ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఈ రంగ పురోగతికి నిదర్శనమన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ 2023-24లో రూ.15,900 కోట్లు, 2024-25లో కేవలం మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఆదిభట్లలో రూ.425 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ‘టాటా సాఫ్రాన్’ ఫెసిలిటీ సెంటర్ ఇటీవల అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలోనే రూ.800 కోట్లతో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ‘యూఏవీ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్’, రూ.500 కోట్లతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రైజెస్ ఛైర్మెన్ సునీల్కాంత్ ముంజాల్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ పీ మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.



