నవతెలంగాణ – హైదరాబాద్: డిజిటల్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా ‘మీసేవ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన సేవలను ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సేవలు ప్రధానంగా విద్యార్థులకు సహాయపడటమే లక్ష్యంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఈ సౌకర్యం ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన అకడమిక్ డాక్యుమెంట్లను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 8096958096 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్ను కేటాయించింది. ఈ నంబర్ను ఉపయోగించి విద్యార్థులు ఎస్ఎస్సీ, ఇంటర్, పీజీ, ఇతర పోటీ పరీక్షల హాల్ టికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ ప్రభుత్వం, మీసేవ, టెక్నాలజీ భాగస్వామి మెటా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దీని ద్వారా 38 ప్రభుత్వ శాఖలకు చెందిన 580కి పైగా సేవలు విద్యార్థులకు వాట్సాప్లోనే లభించనున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఈ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతోపాటు వాయిస్ కమాండ్ ఫీచర్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే నెలల్లో మరిన్ని ప్రభుత్వ శాఖలను ఈ సేవలకు అనుసంధానించనున్నారు.



