పలు సాంస్కృతిక సంస్థలు, రచయితల సంతాపం
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధాదేవి రామరాజు (73) ఆదివారం హైదరాబాద్ నల్లకుంటలోని స్వగృహంలో మృతిచెందారు. వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి సుధాదేవి. తెలుగు అకాడమీ ఉప సంచాలకులుగా 32 ఏండ్లు పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం కూడా రచనా వ్యాసంగం వదలకుం డా తెలుగు సామెతలు, నాటికలు ఉదయకాంతి అమ్మ కవితా సంపుటి, వ్యాస కదంబ.. ఇలా పలు సాహిత్య ప్రక్రియల్లో ఇరవైకి పైగా రచనలు చేసి పలు సంస్థలతో అవార్డులు అందుకున్నారు. డాక్టర్ సి. నారాయణ రెడ్డి, సుశీల నారాయణరెడ్డి అవార్డు కూడా పొందారు. కాగా, పది రోజుల క్రితం సుధాదేవి కథల సంపుటిని ప్రచురణకు ఇచ్చారు.
పలువురి సంతాపం
సుధాదేవి రామరాజు మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు సాహితీ వేత్తలు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత రామ సత్యనారాయణ, ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ, సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, ప్రస్తుత సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, డాక్టర్ సినారె కుమార్తె గంగ, త్యాగరాజ గానసభ అధ్యక్షులు కళా జనార్థన మూర్తి, రసమయి సంస్థ డాక్టర్ ఎంకే రాము, యువ కళా వాహిని లంక లక్ష్మీనారాయణ, కిన్నెర సంస్థ రఘురాం, అభినందన సంస్థ భవాని, రాగ సప్తస్వరాలు సంస్థ రాజ్యలక్ష్మి, కళా నిలయం సంస్థ సురేందర్, శ్రీరామ సంస్థ చంద్రశేఖర్, ఉగాండా తెలుగు సంఘం అధ్యక్షులు బూరుగుపల్లి రాధాకృష్ణ, వైఎస్ రామకృష్ణ, చెన్నై నుంచి సినీ గీత రచయిత భువన చంద్ర తదితరులు సంతాపం తెలిపారు. కాగా, సోమవారం ఉదయం అంబర్ పేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ రచయిత్రి డాక్టర్ సుధాదేవి ఆకస్మిక మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



