ముగిసిన పోలీస్ కస్టడీ
ఐదురోజుల విచారణలో
కీలక విషయాలు వెల్లడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. 5 రోజుల కస్టడీలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని, దాదాపు రూ.100 కోట్లకుపైగా సంపాదించాడని పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. మూవీపై క్లిక్ చేయగానే దాదాపు 15 నుంచి 20 యాడ్స్కు డైరెక్ట్ లింక్ అయ్యేలా సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేయడంతో భారీగా లాభాలొచ్చాయని తెలిసింది. రవి ఐదు రోజుల కస్టడీలో వెబ్సైట్, డొమైన్ నెట్వర్క్స్, ఐపీమాస్క్ తదితర అంశాలపై పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. రవి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి టైక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ యాప్తోపాటు ఇతర యాప్ల ద్వారా భారీగా డబ్బులు సంపాదించిన రవి వివిధ బ్యాంకుల్లో రూ.20 కోట్ల బదిలీ చేయించుకున్నాడు. లావాదేవీలపై బ్యాంక్ అధికారుల సహకారంతో వివరాలు తెప్పించుకున్న పోలీసులు ఆ దిశగా రవిని ప్రశ్నించినట్టు తెలిసింది. వచ్చిన డాలర్లను క్రిప్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపినట్టు గుర్తించారు. ఇదిలావుండగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్నీ తానొక్కడినే చేశానని, తన వెనుక ఎవరూ లేరని రవి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. మరోసారి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని పూర్తి వివరాలు రాబట్టేందుకు కోర్టులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించనున్నారు.
చంచల్గూడ జైలుకు ఐబొమ్మ రవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



