నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రం కోరినా విధంగా తమ పార్టీ నుంచి నాలుగు పేర్లు అందజేశాం, కానీ నిజాయితీలేని బీజేపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా తాము ప్రకటించిన పేర్లను మినహయించి శశిథరూర్ను ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. పార్టీ ప్రకటించని వ్యక్తిని కేంద్రం ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ పార్టీ ప్రతిపాదించిన ఎంపీ పేర్ల విషయంలో మార్పులు చేర్పులు ఉండవని, తమ పార్టీ నిర్ణయానికి కేంద్రం కట్టుబడి ఉండాలని జైరాం రమేష్ చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాలని కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీల పేర్లతో కూడిన ఓ జాబితాను కేంద్రానికి సమర్పించింది. ఇందులో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పేరు లేనేలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుంచి శశిథరూర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా చేసింది.
ప్రతినిధి బృందం కోసం నలుగురు సభ్యుల పేర్లను సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదే రోజు మధ్యాహ్నానికి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ ల పేర్లను కాంగ్రెస్ తరఫున పంపించినట్లు తెలిపారు. ఈ జాబితాలో శశి థరూర్ పేరు చేర్చలేదు. అయితే, తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.