సీపీఐ(ఎం), సీపీఐ మధ్య పరస్పర అవగాహన
సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేయకుండా ఉండాలని సీపీఐ, సీపీఐ(ఎం) పరస్పర అవగాహన కుదుర్చుకున్నాయి. గురువారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో ఆ రెండు పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. అందులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్య, సీపీఐ జాతీయ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, జాతీయ నాయకులు చాడ వెంకట్రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, వీఎస్.బోస్ పాల్గొన్నారు. సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీచేయొద్దని ఇరు పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్యకు గురై నెలరోజులు కావొస్తున్నా పోలీసులు హంతకులను పట్టుకోలేదనీ, కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదనీ, వెంటనే ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.



