డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,
రాష్ట్ర అప్పులపై మాట్లాడిన మంత్రులు
నవతెలంగాణ-కమలాపూర్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రభుత్వ అప్పుల అంశంపై మంత్రులు మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అడ్డుతగలడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామని, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల్లోకి నెట్టిందని మంత్రులు అనడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవేనని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన మంత్రి పొన్నంతో వాగ్వాదానికి దిగారు. ”ముమ్మాటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేసీఆర్ కట్టినవే” అంటూ కౌశిక్రెడ్డి సభలో గట్టిగా వాదించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భారీ అప్పుల కారణంగానే ప్రస్తుతం ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పుల పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని, పథకాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే డ్రామాలు ఆపాలంటూ మంత్రి పొంగులేటితో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామాలతో సభలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంత్రులతో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వాగ్వాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



