తులం రూ.2,060
ముంబయి : దేశంలో పేదోడు బంగారంగా భావించే వెండి కూడా కొనలేని స్థాయికి ఎగిసింది. ఇటీవల వెండి ధరలు నూతన రికార్డ్లను సృష్టిస్తున్నాయి. బుధవారం కిలో వెండి ధర ఏకంగా రూ.2,00,000 మార్కును తాకింది. ఇంతక్రితం రోజుతో పోలిస్తే ఒక్క రోజులోనే కిలోపై రూ.9,000 పెరగడం గమనార్హం. జిఎస్టి 3 శాతం కలిపితే రూ.2.06 లక్షలకు చేరింది. దీంతో 10 గ్రాములు లేదా తులం ధర రూ.2,060కి చేరినట్లయ్యింది. అంతర్జాతీయంగా స్పాట్ వెండి ధర 2.8 శాతం పెరిగి ఔన్సుకు 65.53 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి ధర 65 డాలర్లను దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికా డాలర్ బలహీనపడ టంతో బంగారం ధర కూడా 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,321 డాలర్లకు చేరింది.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.650 పెరిగి రూ.1,34,660గా పలికింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.600 ప్రియమై రూ.1,23,450కి చేరింది. వెండికి పారిశ్రామిక రంగంలో భారీగా డిమాండ్ పెరగడంతో ఈ లోహం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు, సౌర శక్తి, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వెండి సరఫరా లేకపోవడం వల్ల ధరలు ఒక్కసారిగా దూసుకుపోయాయి. భవిష్యత్తులోనూ చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వెండి ధరలు బలంగానే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



