సరిపడా బస్తాలు రాక ఇబ్బందులు
ఒక్కో రైతుకు కేవలం 2-3 బస్తాలే
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో భారీ క్యూ
నవతెలంగాణ – నర్సింహులపేట
యాసంగి సీజన్ ప్రారంభంతో యూరియా కోసం రైతులు మళ్లీ బారులు తీరారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి బుధవారం 1100 యూరియా బస్తాలు రావడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్దమొత్తంలో వచ్చి వరుసలో నిలబడ్డారు. ఒక్కో రైతుకు కేవలం 2 నుంచి 3 బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా యూరియా కోసం గంటల తరబడి వరుసలో నిల్చొన్నా తక్కువ బస్తాలు ఇస్తున్నారని అన్నారు.
ఒక్కసారిగా సహకార సంఘానికి రైతులు తరలిరావడంతో తోపులాట జరిగింది. దాంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల పహారా మధ్య యూరియాను రైతులకు అధికారులు పంపిణీ చేశారు. వారం రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని క్యూలైన్లో వేచి చూశారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఎస్సై మాలోత్ సురేష్ రైతులకు నచ్చజెప్పుతూ యూరియా పంపిణీ చేశారు.



