ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత డి.సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన ఈ విజయం సాధించారు.
ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ‘మన ప్యానల్’ పేరిట చిన్న నిర్మాతలు, ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రొగెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రొగెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. పోలింగ్ అనంతరం నూతన కార్యవర్గాన్ని నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. అధ్యక్షుడుగా సురేష్ బాబు, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్స్గా సూర్యదేవర నాగవంశీ, భరత్ చౌదరి, ట్రెజరర్గా ముత్యాల రాందాస్, జాయింట్ సెక్రటరీలుగా విజయేందర్ రెడ్డి, మోహన్ వడ్లపట్ల ఎంపికయ్యారు. ఏడాది పాటు సురేష్ బాబు అధ్యక్షుడుగా ఉంటారు.
అనంతరం స్టూడియో సెక్టార్ నుంచి ఒకరు అధ్యక్షుడు అవుతారని సి.కళ్యాణ్ తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ప్రోగెసివ్ ప్యానెల్ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,’తెలుగు సినిమా ఆత్మ గౌరవ రక్షణ నినాదంతో మేం ఎన్నికల బరిలో నిలబడ్డాం. ఆ నినాదం లక్ష్యంగా మేం పని చేయబోతున్నాం. అలాగే మాపై నిరాధార ఆరోపణలు చేసిన అందరికీ ఈ ఎన్నికలు గట్టిగా గుణపాఠం చెప్పాయి. తెలుగుచిత్ర పరిశ్రమ అభివృద్ధి, నిర్మాతల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేం ఆహర్శిశలు శ్రమిస్తాం’ అని తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



