నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటిని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. భగీరత్పుర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 25 నుంచి 30 మధ్య ఈ మరణాలు నమోదయ్యాయి. డిసెంబర్ 25న మున్సిపల్ అధికారులు సరఫరా చేసిన కొళాయి నీటిలో ఓ విధమైన వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ నీటిని తాగి పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఆ కాలనీకి చేరుకొని నీటిని పరిశీలించారు.
నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ పరిస్థితి విషమించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికిపైగా ప్రజలు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తాగునీటి పైపులైన్లలో మురుగునీరు కలవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.



