స్విస్ బార్లో చెలరేగిన మంటలు
40మంది మృతి, వందమందికి పైగా గాయాలు
క్రాన్స్-మోంటానా (స్విట్జర్లాండ్) : కొత్త ఏడాదిని స్వాగతించే వేళ.. స్విట్జర్లాండ్లో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్విస్ ఆల్ప్స్ బార్లో చెలరేగిన మంటల్లో 40మంది మరణించారని, వందమందికి పైగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. క్రాన్స్ మోంటానా టౌన్లో విలాసవంతమైన ఆల్పైన్ స్కై రిసార్ట్లోని లీ కాన్స్టెలేషన్ బార్లో జరిగిన ఈ ఘటన ఉగ్రవాద దాడి కాదని, అగ్ని ప్రమాదమని, తెల్లవారు జామున 1.30గంటల సమయంలో బార్లో మంటలు చెలరేగాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆ సమయంలో బార్లో వందమందికి పైనే వున్నారు.
ప్రముఖ టూరిస్ట్ కేంద్రం కావడం, పైగా హాలిడే సీజన్ అయినందున చనిపోయిన వారిలో మెజారిటీ వ్యక్తులు టూరిస్ట్లేనని పోలీసు ప్రతినిధి చెప్పారు. మృతుల్లో వివిధ దేశాలకు చెందినవారు వున్నారని చెప్పారు కానీ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. వేడుకల సందర్భంగా బార్లో మంటలు చెలరేగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సంగీత కచేరి సందర్భంగా బాణాసంచా కాల్చారని, అప్పుడే పెద్ద పేలుడు జరిగి మంటలు ఎగిసివుండవచ్చని స్విస్ మీడియా వార్తలు పేర్కొంటున్నాయి. కాగా పోలీసులు మాత్రం ఇంకా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.



