– జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన ఎస్డీఆర్ఎఫ్ చీఫ్ అర్వింద్కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోకి నైరుతీ రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశిస్తున్నందున, అకాల, భారీ వర్షాల పట్ల జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ (ఎస్డీఆర్ఎఫ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లను హెచ్చరించారు. ఈనెలాఖరులోగానే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందనీ, వాటివల్ల ఎలాంటి విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను విడుదల చేశారు. గత ఏడాది ఆగస్టులో వచ్చిన భారీ వర్షాలతో సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేరుకోక పోవడంతో తీవ్ర నష్టం జరిగిందనీ, ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 12 స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్ఆర్డీఎఫ్)లను సిద్ధంగా ఉంచామన్నారు. ఒక్కో టీమ్లో తెలంగాణా స్పెషల్ పోలీస్కు చెందిన వందమంది సుశిక్షితులైన పోలీసులు ఉంటారనీ, ఈ బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడైనా భారీ వర్షాలు, తుఫానులు వస్తే, కలెక్టర్ల ఆదేశాలతో ఈ బృందాలు అక్కడకు చేరుకొని సహాయ, పునరావాస చర్యలు చేపడతాయన్నారు. వీటికి అదనంగా హైదరాబాద్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఫైర్ స్టేషన్ల సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నివారణ చర్యలపై శిక్షణను ఇచ్చామన్నారు. హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో తక్షణం స్పందించేలా హైడ్రా బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్లు ఈ బృందాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే విపత్తుల నివారణలో సుశిక్షితులైన సింగరేణి కాలరీస్ సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తుల నిర్వహణ శాఖ సంసిద్ధంగా ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.
ముందస్తు వర్షాలు.. అలెర్ట్గా ఉండండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES