నవతెలంగాణ-హైదరాబాద్: సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ నలుగురు ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ విజేందర్ గుప్తా శుక్రవారం సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు నిరంతరం అంతరాయం కలిగించడమే కాకుండా సభ మర్యాదను ఉల్లంఘిస్తున్నందున ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు సోమదత్, జర్నైల్ సింగ్, సంజీవ్ ఝా, కుల్దీప్ కుమార్లను అసెంబ్లీ శీతాకాల సమావేశాల మిగిలిన సమయం వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సభకు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో జర్నైల్ సింగ్, సంజీవ్ ఝా, కుల్దీప్ కుమార్లను గతంలో మూడు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నేత అతిషి గురుతేజ్ బహదూర్ను అవమానించారని ఆరోపిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక వీడియోను షేర్ చేస్తున్నారని సంజీవ్ఝా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆ పోస్ట్లను తొలగించాలని తాను డిమాండ్ చేయడంతో తనను అసెంబ్లీ నుండి బయటకు పంపారని అన్నారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినందున దానిని పోస్ట్ చేయకుండా ఆదేశించాల్సిందిగా స్పీకర్ను తాను కోరినట్లు తెలిపారు. పోస్ట్ తొలగించాలని డిమాండ్ చేసినందుకు తనను మార్షల్స్తో బయటకు పంపారని, వాకౌట్ చేయాలని యత్నించిన తన సహచరులను కూడా నెట్టివేశారని అన్నారు.



