చైనీస్ తైపీతో క్వార్టర్స్ పోరు నేడు
థామస్ కప్ 2026
హార్సెన్స్ (డెన్మార్క్) : ప్రతిష్టాత్మక థామస్ కప్ (ప్రపంచ టీమ్ చాంపియన్షిప్స్)ను మరోసారి దక్కించుకునేందుకు టీమ్ ఇండియా అడుగులు వేస్తోంది. గ్రూప్ దశలో కెనడాపై 4-1, ఆస్ట్రేలియాపై 5-0తో విజయాలు సాధించిన భారత పురుషుల జట్టు చైనా చేతిలో 2-3తో నిరాశపరిచినా క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. 2022లో థామస్ కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్.. నేడు క్వార్టర్ఫైనల్లో బలమైన చైనీస్తైపీతో తాడోపేడో తేల్చుకోనుంది. చైనీస్తైపీ సింగిల్స్ విభాగంలో భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుండగా.. డబుల్స్ విభాగాల్లో మనదే పైచేయి!. లక్ష్యసేన్, హెచ్.ఎస్ ప్రణరు సహా ఆయుష్ శెట్టిలు మూడు సింగిల్స్ మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే భారత్కు సెమీఫైనల్ బెర్త్ ఖాయం. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు సహా ఎం.ఆర్ అర్జున్, హరిహరణ్లు అంచనాలను అందుకోవాల్సి ఉంది. కనీసం రెండు సింగిల్స్, ఓ డబుల్స్ మ్యాచ్లో విజయం భారత్కు సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేయనుంది. చైనీస్ తైపీ బ్యాడ్మింటన్లో పవర్హౌస్గా కొనసాగుతున్నా ఇప్పటివరకు థామస్ కప్ టైటిల్ను అందుకోలేదు. ‘థామస్ కప్లో భారత్ పుంజుకుని టైటిల్ సాధించేందుకు ఇదో గొప్ప అవకాశం. మన ముగ్గురు సింగిల్స్ షట్లర్లు రాణించి, డబుల్స్లో సాత్విక్, చిరాగ్లు మెరిస్తే భారత్కు తిరుగుండదు’ అని భారత మాజీ కోచ్ విమల్ కుమార్ అన్నారు. 2022లో థామస్ కప్ విజేతగా నిలిచిన భారత్.. 1952, 1955, 1979లో కాంస్య పతకాలు సాధించింది.



