నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ …. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో చర్చించారు. నెతన్యాహూతో మాట్లాడిన పుతిన్.. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన ప్రయత్నాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో సంబంధాలను కొనసాగించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని క్రెమిన్ వెల్లడించింది.
అదేవిధంగా, ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగుతున్న నిరసనలను చల్లార్చి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో పుతిన్కు వివరించారని కూడా క్రెమిన్ తెలిపింది. ఇదిలా ఉండగా … ఇరాన్లో ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో మొదలైన నిరసనలు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలుగా మారాయి. ఈ నిరసనలపై ప్రభుత్వ అణచివేత చర్యల వల్ల వేలాది మంది అరెస్టయ్యారు. వందలాది మరణాలు చోటుచేసుకున్నాయని సమాచారం.



