Wednesday, May 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరెచ్చగొడుతున్న అమెరికా : యుఎఈపై ఇరాన్ దాడి ఆంతర్యం!?

రెచ్చగొడుతున్న అమెరికా : యుఎఈపై ఇరాన్ దాడి ఆంతర్యం!?

- Advertisement -

ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. రెండు దేశాల మధ్య పరస్పర దాడులు నిలిచిపోయాయి. అమెరికా కారణంగా ఇస్లామాబాద్‌లో తొలి చర్చలు విఫలమైన తరువాత ఇంతవరకు దోబూచులాట తప్ప మలి చర్చలు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం నాడు తమపై ఇరాన్ 15ఖండాంతర, మూడు క్రూయిజ్ క్షిపణులు,నాలుగు డ్రోన్లతో దాడులు చేసిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరోపించింది. (యుఏఈ-దుబాయ్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది. దుబాయ్, షార్జా, అబూదాబీ వంటి ఏడు ప్రాంతాలు కలసి ఉన్నదేశాన్ని ఐక్య అరబ్ ఎమిరేట్స్‌గా వ్యవహరిస్తారు, 1971లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది, రాజధాని అబూదాబీ, కోటి పది లక్షల మంది జనాభా ఉండగా దుబాయ్ పెద్ద నగరం) కాల్పుల విరమణ అవగాహన తరువాత ఇదే పెద్ద దాడి. దుబాయ్ చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఫుజాయిరా రేవుపై జరిగినదాడిలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని వార్తలు. ముగ్గురు భారతీయ కార్మికులు గాయపడ్డారు. హార్ముజ్ జలసంధితో నిమిత్తం లేకుండా వేరే మార్గంలో చమురు ఎగుమతులు చేసేందుకు ఈ రేవు అనువుగా ఉంది. జలసంధి వెలుపల తిష్టవేసిన అమెరికా ప్రతి రోజూ ఇరాన్‌‌ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నది, బలవంతంగా జలాల్లో ప్రవేశించేందుకు పూనుకుంది.

అందువల్లనే ఇది పధకం ప్రకారం చేసిన దాడి కాదని, “అమెరికా మిలిటరీ దుస్సా హసానికి ” ప్రతి స్పందన అని ఇరాన్ వర్ణించింది.ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధి వెలుపలనే తిష్టవేసిన అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు చూసినపుడు తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించగా అబ్బే అలాంటిదేమీ లేదని ట్రంప్ చెప్పుకున్నాడు. ఇరాన్ దాడి వెనుక అనేక అర్ధాలు, అంశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఎమిరేట్స్‌ను ఒంటరి పాటు చేసేందుకు ఇరాన్ పూనుకుందని చెప్పవచ్చు. కాల్పుల విరమణ అవగాహనకు తూట్లు పొడిచిన దేశంగా కొంత మంది అభివర్ణిస్తుంటే దుబాయిపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు మోడీ సర్కార్ స్పందించింది. రుణాలు చెల్లించాలని పాకిస్తాన్‌పై ఎమిరేట్స్ వత్తిడి చేయటం వెనుక మనదేశం కూడా ఉందని వ్యాఖ్యలు వెలువడిన పూర్వరంగంలో కృతజ్ఞతగా ఇలా స్పందించిందని చెప్పవచ్చు. ఒకసారికి మాత్రమే దాడులకు ఇరాన్ పరిమితం అవుతుందా కొనసాగిస్తుందా అన్నది తెలియదు.స్కూళ్లకు వెళ్లకుండా విద్యార్థులకు తరగతులను నిర్వహించాలని ఎమిరేట్స్ నిర్ణయించింది.

పశ్చిమాసియా పరిణామాల్లో గల్ఫ్ దేశాల పాత్ర గురించి మీడియా అంతగా కేంద్రీకరించకపోవటానికి కారణం వార్తా సంస్థలను పశ్చిమదేశాలు నియంత్రించటమే. చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల బృందం(ఒపెక్) నుంచి దుబాయి ఎందుకు ఆకస్మికంగా బయటకు వచ్చింది. దాని వెనుక ఉన్న కథేంటి అన్నది తెలుసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో గతంలోనే విబేధాలు ఉన్నప్పటికీ అవి ఈ సందర్భంగా మరింతగా బయటకు వచ్చాయి. రానున్న రోజుల్లో ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేము. ఇరాన్ దాడి తమ భద్రత, సరిహద్దులకు ముప్పు అని ఏ మాత్రం సహించేది లేదని, ప్రతి స్పందించే హక్కు తమకుందని ఎమిరేట్స్ ప్రకటించింది. తాము పథకం ప్రకారం దాడి చేయలేదని, నియంత్రణల్లో ఉన్న హార్ముజ్ జలసంధి నుంచి నౌకలకు దారి కల్పించేందుకు అమెరికా చేసిన మిలిటరీ దుస్సాహసానికి స్పందనకు ఫలితమని ఇరాన్ అధికారి చెప్పాడు. అంతకుముందు నౌకలకు దారి కల్పిస్తామని అమెరికా ప్రకటించింది.ఈ క్రమంలో ఒక యుద్ధ నౌకపై ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించింది. తాము వేగంగా వచ్చి దాడులు చేసే ఆరు ఇరాన్ నౌకలపై కాల్పులు జరిపామని, వాటిని ముంచివేశామని, ఇరాన్ దాడిలో దెబ్బతిన్నది దక్షిణ కొరియా నౌక తప్ప తమది కాదని అమెరికా చెప్పుకుంది.ఎమిరేట్స్‌పై దాడి పెద్ద విషయం కాదని, చర్చల్లో ఇరాన్ ఎంతో నయంగా ఉందనికూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు.

ఇరాన్ మీద దాడి చేసిన ఇజ్రాయిల్‌కు యుఏఈ ఎంతో సన్నిహితంగా ఉంది. లాంఛనంగా రక్షణ ఒప్పందం లేకున్నప్పటికీ అదే మాదిరి రెండు దేశాలూ వ్యవహరిస్తున్నాయి.ఇరాన్ దాడుల నుంచి రక్షణకు గగనతల వ్యవస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.టెహరాన్‌పై ఇజ్రాయిల్‌ దుష్ట పథకాలకు ఎమిరేట్స్ ఎప్పటి నుంచో సాయపడుతున్నది. అమెరికా స్థావరాలకు చోటు కల్పించటమేగాక దాడులకు సైతం తమ వైమానిక స్థావరాల సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ఎమిరేట్స్ సహకరించిందని, ఒమన్, మరొక దేశం మీద ఇజ్రా‌యిల్‌‌నే దాడిచేసి తాము చేసినట్లుగా చిత్రించేందుకు కూడా తోడ్పడినట్లు ఇరాన్ నిర్ధారించుకున్నది.తమ గురించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చినట్లు టెహరాన్ భావిస్తున్నది. అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయెద్(ఎంబిజెడ్) ఇజ్రాయిల్ మొసాద్, అమెరికా సిఐఏలతో కలసి పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాడు.ఈజిప్టులోతొలిసారిగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ మొర్సీ ప్రభుత్వాన్ని కూలదోయటం, అరబ్బు విప్లవాలను పక్కదారి పట్టించేందుకు నిధులు అందచేయటం వంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి.వాటిలో భాగంగా ట్యునీసియా,లిబియా, సూడాన్, ఎమెన్‌లలో జోక్యం చేసుకోవటం, నేరగాండ్లు, కిరాయి సాయుధులను సమకూర్చి అంతర్యుద్దాలకు దోహదం చేయటం వంటి దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈ కారణంగా లక్షలాది మంది అరబ్బులు మరణించటం, ఇబ్బందులకు గురయ్యారు.

తన సరిహద్దులను విస్తరించేందుకు ఇజ్రాయిల్‌ ఎలా దుర్మార్గాలకు పాల్పడుతున్నదో అదేమాదిరి ఎమిరేట్స్ విస్తరణకు పథకాలు వేశాడని కూడా చెబుతారు. పశ్చిమ దేశాలలో విద్యను అభ్యసించిన ఎంబిజె అమెరికాలో తన పలుకుబడిని పెంచుకొనేందుకు అప్పటి వరకు ప్రపంచానికి అంతగా తెలియని సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మా‌న్‌‌ను అమెరికన్లకు పరిచయం చేశాడు. తరువాత రియాద్‌లో ఉన్న ప్రముఖులను సిఐఏ ఏజెంట్లుగా మార్చేందుకు సహకరించాడు. ఎమెన్‌లో ఇరాన్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అక్కడి వేర్పాటువాదులను తొలుత ఎమిరేట్స్ ప్రోత్సహించింది, తరువాత ఆ బాధ్యతను చేపట్టేట్లుగా సౌదీ అరేబియాను ప్రయోగించింది. తరువాత ప్రత్యర్ధులుగా మారారు. ఇప్పుడు సూడాన్, లిబియా, ఎమెన్‌‌లలో ఉన్న ఎమిరేట్స్ మద్దతు ఉన్న సాయుధులను అడ్డుకొనేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు చూస్తున్నాయి.

అమెరికా ఎత్తుగడలో భాగంగా ఒపెక్ కూటమి నుంచి ఎమిరేట్స్ వైదొలుగుతూ గతవారంలో నిర్ణయం తీసుకుంది. చమురు ఉత్పత్తి కోటాలతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. ఆరుదశాబ్దాలుగా ఒపెక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సౌదీని, ఇరాన్ను దెబ్బతీసేందుకే ఈ మేరకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. రియాద్-అబూదాబీల మధ్య శాశ్వత వైరుధ్యం ఏర్పడినట్లు అల్జీరియా అధ్యక్షుడు అబ్దుల్‌మాదిజిద్ తెబ్బోనే వ్యాఖ్యానించాడు, ఎమిరేట్స్ వైదొలగటాన్ని తాను పట్టించుకోవటం లేదన్నాడు. ఎమిరేట్స్‌పై ఇరాన్ దాడి చేస్తే సౌదీ ఉష్ట్రపక్షిలా ఉందంటూ అబుదాబీ వ్యాఖ్యాతలు రెచ్చిపోయారు.అయితే ఎమిరేట్స్ వైదొలిగినందున అది నష్టపోయే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. వలస కార్మికులు, కిరాయి సాయుధ మూకలు, చిన్న సైన్యం మాత్రమే కలిగి ఉన్నందున ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్న.ఇజ్రాయెల్, అమెరికాలు ఆదుకుంటాయనే ఆశ మాత్రమే ఉంది. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లు, క్షిపణులను పసిగట్టే లేజర్ వ్యవస్థలను ఇజ్రాయిల్‌ సమకూర్చి, వాటి నిర్వహణకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటు అబుదాబీ, దుబాయ్ నగరాలకు ఐరన్ డ్రోమ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది.

ఇరాన్ వీటన్నింటినీ గమనించిన కారణంగానే సోమవారం నాడు ఎమిరేట్స్ మీద క్షిపణి ప్రయోగం చేసింది. లెబనాన్‌లోని తన మద్దతుదారులైన హిజబుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్ జరుపుతున్నదాడులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. దుబాయ్ పథకాలపై ఒక్క టెహరానే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సౌదీ, ఒమన్,కతార్, పాకిస్తాన్, టర్కీ కూడా ప్రేక్షకులుగా ఉండజాలవు. ఉమ్మడి శత్రువైన ఇజ్రా‌యిల్‌తో పాటు దానికి సహకరించే ఏ దేశాన్నీ కూడా అవి వదలవు.ఇటీవలి దాడులతో ఇరాన్ పట్ల గల్ఫ్ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ అమెరికాతో కలసి దాడులకు పూనుకోలేదు. సోమవారం నాడు ఎమిరేట్స్‌పై దాడి గురించి ముందుగానే సౌదీ అరేబియా, ఒమెన్‌లకు ఇరాన్ చెప్పినట్లు గత గురువారం నాడే అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ రాయటం గమనించాలి. అయితే ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పిందీ ఆ పత్రిక వెల్లడించలేదు. ఇరాన్ చర్యలపై ఆగ్రహం ప్రకటించినప్పటికీ సౌదీ మంత్రులు టెహరాన్‌తో సంబంధాల్లోనే ఉన్నారు. ఎమిరేట్స్ మద్దతుదార్లను వ్యతిరేకించే శక్తులకు పాకిస్తాన్‌లో సౌదీ కొనుగోలు చేసిన ఆయుధాలను మార్చినెలలో లిబియాకు తరలించారు. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడులకు సంబంధించి ఎమిరేట్స్ మీద ప్రత్యేకంగా కేంద్రీకరించినట్లు వివరాలు వెల్లడి అవుతున్నాయి.

కాల్పుల విరమణకు ముందు రెండు వేల ఖండాంతర క్షిపణులు, డ్రోన్లను టెహరాన్ సంధించింది.మిగతా దేశాలతో పోలిస్తే ఎమిరేట్స్ వైఖరి ఒకటైతే అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చేందుకు కూడా దానిపై దాడులను కేంద్రీకరిం చిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా, లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా దుబాయ్, తదితర నగరాలకు రావటం కూడా ఒక ప్రధాన కారణం. దాడుల్లో ఎవరైనా విదేశీయులకు హాని జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది, పర్యాటకులు, వ్యాపారుల రాక తగ్గి ఆర్థికంగా ఎమిరేట్స్ నష్టపోతుందనే ఎత్తుగడ కూడా ఉంది.అది భావించినట్లుగానే అనేక హోటళ్ల గదులు జనాలు లేక ఖాళీగా ఉంటున్నాయి. ఇదే అదునుగా అవసరమైన మరమ్మతులకు వాటిని మూసినట్లు కూడా చెబుతున్నారు. అమెరికా దాడులకు సౌదీ సహకరించినప్పటికీ చర్చలకూ చొరవ చూపిందని చెబుతుండగా దాడులను కొనసాగించాల్సిందేనని ఎమిరేట్స్ పట్టుబడుతున్నదని, తొమ్మిదినెలల వరకు దాడులు జరిగినా తట్టుకుంటామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

మధ్యవర్తిగా ముందుకు వచ్చిన పాకిస్తాన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమై ఎమిరేట్స్ తమ రుణాలను వెంటనే తీర్చాలని మెడమీద కత్తి పెట్టినట్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనికి రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు. సౌదీతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవటం, ఇరాన్ దాడులను ఖండించాలన్న డిమాండ్‌కు అంగీకరించక పోవటం, పాక్‌ను దెబ్బతీసేందుకు భారత్ తెచ్చిన వత్తిడి ఉన్నట్లు భావిస్తున్నారు. ఎమిరేట్స్‌పై ఇరాన్ జరిపిన దాడి మీద అమెరికా, ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.ఈ చిన్నదాడి మరోసారి ఉద్రిక్తతలు, దాడులకు దారితీస్తుందా? అమెరికా మరోసారి అంతదుస్సాహససానికి ఒడిగడుతుందా ? ట్రంప్‌ను పరీక్షించేందుకు ఇరాన్ దాడి జరిపిందా? ఇలా ఎన్నో ప్రస్తుతానికి సమాధానం లేని సందేహాలు!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -