తాత్కాలిక కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్
నవతెలంగాణ – పరకాల
పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య గ అనారోగ్య కారణంగా సుదీర్ఘ సెలవుపై వెళ్లారు. ఆయన ఈనెల ఆరవ తేదీ నుండి 26వ తేదీ వరకు సుమారు 20 రోజులపాటు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. సెలవు కాలంలో మున్సిపల్ పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా, ప్రభుత్వం మున్సిపల్ ఏఈ రంజిత్ కు తాత్కాలిక కమిషనర్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. అంజయ్య తన అనారోగ్య పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించి, నిబంధనల ప్రకారమే సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంజయ్య అనారోగ్యం కారణంగానే సెలవు పెట్టినప్పటికీ, పట్టణంలో దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గత మూడేళ్ల కాలంలో పరకాల మున్సిపాలిటీలో ఇప్పటికే నలుగురు కమిషనర్లు మారడం, ఇప్పుడు అంజయ్య కూడా లాంగ్ లీవ్లో వెళ్లడంతో ఇది రాజకీయ కారణమా లేక మరేదైనా కారణమా అని పట్టణ వాసులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే, మున్సిపల్ వర్గాలు మాత్రం ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని, ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి బాధ్యతలు చేపడతారని స్పష్టం చేస్తున్నాయి. తరచుగా అధికారులు మారుతుండటం వల్ల పరిపాలనపై ప్రభావం పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.



