నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ప్రజా కంఠకులు, మాఫియా ముఠాల చేత హత్య చేయబడిన కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న అమరత్వానికి 21 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆయన ఆశయాలు, ఎత్తిన ఎర్రజెండా, పోరాట మార్గం నేటికీ చెక్కుచెదరకుండా సజీవంగా ఉన్నాయని ఇక్కిరి సహదేవ్, కల్లెపు అడివయ్య పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన విప్లవ ఆశయాలు ఆదర్శంగా నిలుస్తూ విముక్తికి మార్గాన్ని చూపిస్తున్నాయని తెలిపారు.కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న 21వ వర్ధంతిని మే 18న ఉదయం 10 గంటలకు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా మహాసభలను కూడా అదే రోజు టంగుటూరులోని అమరవీరులు కామ్రేడ్ కట్టా నర్సింహారెడ్డి,కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న స్మారక ప్రాంగణంలో నిర్వహిస్తున్నానమన్నారు. రైతు,కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.గురువారం టంగుటూరు గ్రామంలో కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న వర్ధంతి, ఏఐకేఎంఎస్ జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా మహాసభలో గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్, గ్రామ కార్యదర్శి మారుజోడు సిద్దేశ్వర్, అరుణోదయ జిల్లా కార్యదర్శి ఎలగందుల సిద్దులు,జాలపు సుధాకర్ రెడ్డి,గజరాజ జహంగీర్, బండి ఎర్రప్ప, పరిమెల సత్యనారాయణ, దూడల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



