– ప్రజా సమస్యలు పక్కనబెట్టి కంపెనీకి రెడ్కార్పెట్నా..?
– ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న బాధితులు.. శంకుస్థాపనకు సిద్ధమైన యంత్రాంగం..
నవతెలంగాణ – కొండాపూర్: కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న భారీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానుండటంతో గ్రామంలో రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు హామీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇప్పటికీ అందకపోవడం, కంపెనీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి అనుమతులపై స్పష్టత లేకపోవడం వంటి అంశాల మధ్య ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మైనింగ్ & జియాలజీ శాఖ మంత్రి డా॥ గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమం కోసం గ్రామంలో భారీగా స్వాగత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
అయితే మరోవైపు గ్రామ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. “భూములు తీసుకున్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.. కానీ ఇప్పటివరకు ఒక్కరికీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి” అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం, సాధారణ ప్రజలు చిన్న ఇల్లు నిర్మించాలన్నా అనేక అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. అలాంటప్పుడు భారీ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించిన పూర్తి పత్రాలు, అనుమతుల వివరాలు ప్రజలకు వెల్లడించకుండా శంకుస్థాపన నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.
మంత్రులు వస్తున్నారు.. సమస్యలు వింటారా..?
శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు హాజరుకానుండటంతో గ్రామ ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, గ్రామ దేవాలయాలకు రహదారులు, కంపెనీకి సంబంధించిన పూర్తి అనుమతుల వివరాలు వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
“షాడో నాయకుడు”పై జోరుగా చర్చ!!
ఇక ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఓ “షాడో నాయకుడు” కంపెనీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడనే ప్రచారం మండల రాజకీయాల్లో వేడి పెంచుతోంది. అధికార అండతో నిబంధనలను పక్కనబెట్టి పనులు వేగంగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం మౌనం పాటించడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో తొగర్పల్లి గ్రామంలో ఇప్పుడు ఒక్కటే చర్చ నడుస్తోంది. “మంత్రులు కంపెనీ శంకుస్థాపనకే వస్తున్నారా..? లేక ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కూడా ముందుకు వస్తారా..?” అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


