సాత్విక్, చిరాగ్ జోడీ సైతం
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500
బ్యాంకాక్ (థాయ్లాండ్): భారత అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లో పి.వి సింధు 21-13, 21-15తో డెన్మార్క్ షట్లర్ అమేలిపై అలవోక విజయం సాధించింది. 28 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు నేడు క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.3 అకానె యమగూచి (జపాన్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ఏడో సీడ్ లక్ష్యసేన్ సైతం క్వార్టర్ఫైనల్కు చేరుకున్నాడు. 21-12, 21-13తో చైనా షట్లర్ జు చెన్పై లక్ష్యసేన్ గెలుపొందాడు. 39 నిమిషాల పాటు సాగిన ప్రీ క్వార్టర్ఫైనల్లో రెండు గేముల్లోనూ లక్ష్యసేన్ పైచేయి సాధించాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సైతం క్వార్టర్ఫైనల్లో కాలుమోపారు. 21-12, 21-19తో 44 నిమిషాల మ్యాచ్లో మలేషియా జోడీపై మనోళ్లు మెరుపు విజయం నమోదు చేశారు. వరల్డ్ నం.4 సాత్విక్, చిరాగ్లు నేడు క్వార్టర్ఫైనల్లో జపాన్ జోడీ నొముర, షిమోగమిలతో పోటీపడనున్నారు. ఇదిలా ఉండగా, మెన్స్ సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ పోరాటానికి ప్రీ క్వార్టర్ఫైనల్లోనే తెరపడింది. 70 నిమిషాల ఉత్కంఠ పోరులో 16-21, 21-1, 18-21తో చైనీస్ తైపీ షట్లర్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్లో దేవిక 21-23, 11-21తో థాయ్లాండ్ షట్లర్ పిచమాన్ చేతిలో పోరాడి ఓటమిపాలైంది.



