తప్పిన పెను ముప్పు .. సకాలంలో స్పందించిన ఉద్యోగులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మాణ దశలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని యూనిట్-3లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యూనిట్-3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు అంచనా వేశారు. చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలోని కంట్రోల్ కేబుళ్లు, కొన్ని కీలకమైన వాల్వ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అయితే ప్లాంట్ సిబ్బంది, అక్కడే ఉన్న అగ్నిమాపక యంత్రాల ఉద్యోగులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫలితంగా ప్లాంట్లోని బాయిలర్లు, మెయిన్ టర్బైన్లు వంటి ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ జెన్కో ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేయడంతో పాటు, ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ యూనిట్లో ఈనెల 13న అధికారికంగా కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)ని ఖరారు చేయడం గమనార్హం. అది జరిగిన నాలుగు రోజుల్లోనే అగ్ని ప్రమాదం జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



