నవతెలంగాణ – హైదరాబాద్ :తిరుమల కొండపై అత్యంత విచారకరమైన ఘటన చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన వ్యక్తిని తమిళనాడులోని తిరుపత్తూరు పరిధిలోని వనియంబాడికి చెందిన మణికంఠన్ (35)గా గుర్తించారు. అవధూత దత్తపీఠం భవనంపై ఉన్న వాటర్ ట్యాంక్ను మరమ్మతు చేస్తున్న సమయంలో మణికంఠన్ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయాడు. భవనం పైనుంచి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న తోటి కార్మికులు, పీఠం సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మణికంఠన్ తుదిశ్వాస విడిచాడు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.



