విద్యుత్ సంస్థలను ప్రయివేట్ పరం చేసే కుట్ర
బషీర్బాగ్ తరహ మరో ఉద్యమం రావాలి
టీఆర్ఈఈఎఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘తెలంగాణ రైతు డిస్కం అనుమతులను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తిరస్కరించాలి. ముందస్తు అంచనాలు, ప్రణాళిక లేకుండా, పౌరసమాజంతో ఎలాంటి చర్చలు జరపకుండా రాష్ర్టప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం ఏర్పాటు వెనక భారీ కుట్రకోణం దాగుంది. తెలంగాణ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేట్ వ్యక్తులకు ధారదత్తం చేయాలని సర్కార్ ప్రయత్నిస్తోంది. టీడీపీ హయాంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణకు వ్యతిరేకంగా బషీర్బాగ్ తరహ పోరాటం రావాలి’ అని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎలక్ర్టిసిటీ ఇంజినీర్స్ ఎంప్లాయీస్ ఫోరం(టీఆర్ఈఈఎఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి తుల్జారాం సింగ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ గతంలో స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ప్రజలు, విద్యుత్ రంగ నిపుణులతో చర్చించకుండా రూ.35 కోట్ల అప్పులతో ఏర్పాటు చేసే డిస్కం రైతులకు ఎలా మేలు చేస్తుందని ప్రశ్నించారు.
ఈఆర్సీ ఇంకా అనుమతివ్వకుండానే జూన్ 2న రైతు డిస్కంను ప్రారంభిస్తామని సీఎం ఎలా చెబుతారని నిలదీశారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్లో చేరడం, రైతు డిస్కం ఏర్పాటు చేయడం వెనక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు డిస్కంను వేరు చేసి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ను ప్రయివేటీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా డిల్లీలో జరిగిన పోరాటానికి కేంద్రం దిగొచ్చిందని గుర్తు చేశారు. బషీర్బాగ్ పోరాటం తరహాలో తెలంగాణలో మరో విద్యుత్ ఉద్యమం వస్తేగాని దీన్ని అడ్డుకోలేమని తేల్చి చెప్పారు. ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, మేధావులు ఐక్యంగా పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. టీయూసీఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్.
పద్మ మాట్లాడుతూ తెలంగాణలోని విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సర్కార్ వెంటనే రైతు డిస్కం ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజి మాట్లాడుతూ ముందస్తు చర్యలు చేపట్టకుండా రైతు డిస్కంను ఏర్పాటు చేయడం విఫల ప్రయత్నమన్నారు. ఏటా రైతులకు రూ.32 వేల కోట్ల సబ్సీడీల చెల్లించాల్సి ఉండగా, రాష్ర్ట ప్రభుత్వం రూ.16 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తామని చెబుతోందని అన్నారు. మిగతా మొత్తం ఎక్కడి నుంచి వసూలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కో సిబ్బందికి 600 ట్రాన్స్ఫార్మర్లు, 3వేల కనెక్షన్ల నిర్వహణ అప్పగిస్తే రైతులకు నాణ్యమైన సేవలు ఎలా అందుతాయో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఎలక్ర్టిసిటీ ఇంజినీర్స్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షులు మాధవరెడ్డి, వెంకటరెడ్డి, కే.సూర్యనారాయణ, ఆర్.జనార్దన్రెడ్డి, కృష్ణ, రాజిరెడ్డి, కోటేశ్వర్రావు, శ్రీధర్రెడ్డి, సాయిలు, బిక్షపతి, రామేశ్వర్శెట్టి తదితరులు పాల్గొన్నారు.



