నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయ గుట్ట కింద ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే భారీగా ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న17 దుకాణాలు, 15 తోపుడు బండ్లను బూడిద చేశాయి. మంటల ధాటికి దుకాణాల్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అగ్నికీలలు పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి సైతం విస్తరించాయి. దీంతో అందులో ఉన్న కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాంగం రంగంలోకి దిగింది. మూడు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ దుర్ఘటనలో దాదాపు రూ. 2.5 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని సర్పంచ్ వెల్లడించారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడం, దుకాణాల్లో వ్యాపారులు ఎవరూ పడుకోకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.



