నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తరహాలోనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సర్ పై పోరుబాటపట్టారు. ఎస్ఐఆర్లో మృతి చెందినట్లు చూపించి ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించిన ఓటర్లు ఢిల్లీలో హేలి రోడ్, బాణక్యపురిలోని రెండు బంగా భవన్లు (పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గెస్ట్ హౌస్లు) చేరుకున్నారు. వీరితోపాటు బెంగాల్ సీఎం మమతా, టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతోపాటు పలువురు సీనియర్ నేతలు కూడా బంగా భవన్కు చేరుకున్నారు. దీంతో పోలీసులు బంగా భవన్ చుట్టూ భారీగా మోహరించారు. దీంతో అక్కడ మమతాకు, పోలీసులకు మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారో చూడండి. మేము వారిని విమర్శించడం లేదు. ఎందుకంటే అది వారి తప్పు కాదు. మేము ఎన్నికల సంఘాన్ని కలవాలనుకున్నాము. దీనికి స్పందనగా ఢిల్లీ పోలీసులతో నిండిన బస్సు ఇక్కడికి వచ్చింది.
మేము అపాయింట్మెంట్ తీసుకునే ఇక్కడికి వచ్చాము. ఓటర్ల జాబితాలో తమ పేర్లను తీసేయడం వల్ల 150 మంది చనిపోయారు. చాలామంది కుటుంబ సభ్యులను చనిపోయినట్లు చూపించి వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించి.. వారి హక్కుల్ని దొంగిలించారు. ఢిల్లీలో పేలుడు జరిగినప్పుడు ఢిల్లీ పోలీసులు ఎక్కడ ఉన్నారు? మేము వచ్చినప్పుడు ఢిల్లీ ఎందుకు భయపడుతుంది? మేము కోరుకుంటే ఇక్కడికి లక్షలాది మందిని తీసుకురాగలం.
కానీ మేము ఎస్ఐఆర్లో చనిపోయినట్టు ప్రకటించిన 50 మందినే ఇక్కడికి తీసుకువచ్చాము. ఢిల్లీ పోలీసులు ఎవరినీ రక్షించలేరు. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది’ అని అన్నారు.
కాగా, మమతాబెనర్జీ, అభిషేక్ బెనర్జీలతోపాటు పలవురు టిఎంసి నేతల బృందం నేడు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ని కలవనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల వివరాలకు సంబంధించి వారు ఎన్నికల చీఫ్ అధికారితో మాట్లాడనున్నారు.



